మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహారశైలి ఎవరికీ అంతుచిక్కడం లేదు . అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి చవిచూడడంతో, పార్టీ కార్యక్రమాల పట్ల గంటా అంటిముట్టనట్లు వ్యవహరించారు . దీనితో ఆయన పార్టీ వీడడం ఖాయమన్న ఊహాగానాలు విన్పించాయి . ఒకదశలో దాదాపు 10 మంది టీడీపీ శాసనసభ్యులను వెంటబెట్టుకుని గంటా, బీజేపీ గూటికి చేరనున్నారన్న ప్రచారం జరిగింది . ఆ తరువాత ఆయన బీజేపీ లో కాదు, అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ఊహాగానాలు విన్పించాయి . అధికారం ఎక్కడ ఉంటే, అక్కడ ఉండే గంటా నిజంగానే పార్టీ మారే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు నిన్న , మొన్నటి వరకు విన్పించాయి .
అయితే తాజాగా బీజేపీ కి చెందిన 300 మంది బీజేపీ నేతలు , కార్యకర్తలకు గంటా పచ్చ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం చూస్తే ... ఆయన వ్యూహమేమిటన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు . ఆంధ్ర ప్రదేశ్ లో మార్చి 15 వ తేదీ తరువాత ఎప్పుడైన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండడంతో , పార్టీ బలోపేతమే లక్ష్యంగా గంటా , ఇతర పార్టీల నుంచి చేరికలు ప్రోత్సహిస్తున్నట్లుగా తెలుస్తోంది . టీడీపీ వీడడం ఖాయమంటూ నిన్న , మొన్నటి వరకు జరిగిన ప్రచారాన్ని తిప్పికొడుతూ ఈ నెల 19 వ తేదీ నుంచి జనచైతన్య యాత్ర చేపడుతానని గంటా ప్రకటించడం హాట్ టాఫిక్ గా మారింది .
గంటా తిరిగి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని నిర్ణయించడం తో టీడీపీ నాయకత్వం ఊపిరి పీల్చుకుంటే , బీజేపీ నాయకత్వం మాత్రం ఆయనపై ఆగ్రహం తో రగిలిపోతోంది . తమ పార్టీలో చేరుతాడని భావిస్తే , తమ పార్టీని దెబ్బకొట్టేందు గంటా ప్రయత్నించడం కమలనాథులకు ఏమాత్రం రుచించడం లేదు .