విశాఖ వెంకోజీ పాలెంలోని జ్ఞానానంద- రామానంద ఆశ్రమం నిర్వాహకులను.. ఆశ్రమం ఖాలీ చేసి వెళ్లిపోమని వైసీపీ ఎంపీ, నేతలు బెదిరిస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి పత్రిక సంచలన కథనం రాసింది. విశాఖ రాజధాని కాకముందే వైసీపీ నేతల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయనేలా కథనం రాసింది. ఈ కథనంలో ఆశ్రమం నిర్వాహాకులు ఏమంటున్నారో తెలిపారు.

 

వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆశ్రమం స్థలంలో అపార్ట్ మెంట్ కట్టారని ఆశ్రమ నిర్వాహకులు స్వామి పూర్ణనంద సరస్వతి చెప్పినట్టు రాశారు. ఆశ్రమాన్ని ఓ ప్రైవేటు ట్రస్టుకు ఇ‌వ్వాలని తనను బెదిరిస్తున్నారని ఆయన చెప్పినట్టు ఆంధ్రజ్యోతి రాసింది. దీనిపై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పందించారు. పచ్చ పత్రికలు పచ్చి అబద్ధాలు రాస్తున్నాయని ఆరోపించారు. తాను ఆశ్రమ స్థలాన్ని ఆక్రమించినట్లు వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. వార్తలు రాసే ముందు వివరణ కోరాలని, సాక్ష్యాధారాలు లేకుండా కథనాలు రాయడం దారుణమన్నారు.

 

ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కథనాలు రాయడం సరైంది కాదని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. వార్త రాసే ముందు సంబంధిత వ్యక్తులపై వివరణ తీసుకోవాల్సిన బాధ్యత ఆ పత్రికలకు ఉందన్నారు. రాసిన వార్తలకు ఎలాంటి సాక్ష్యాధారాలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఒక రిటైర్డు పోలీసు అధికారి, ఓ రెవెన్యూ అధికారి వాళ్ల వద్దకు వెళ్లి బెదిరించినట్లు వార్తలు రాశారు. ఆ అధికారులు ఎవరో చెబితే చర్యలు తీసుకుంటామన్నారు.

 

అవాస్తవాలు రాయడం దారుణం. దేవాదాయ శాఖ నుంచి ఓ అధికారి ఫోన్‌ చేశారని రాశారు. ఆ అధికారి ఎవరో చెప్పండి. కాల్‌ రికార్డు ఇస్తే చర్యలు తీసుకుంటాం. దొంక తిరుగుడు రాతలు ఎందుకో అర్థం కావడం లేదు. ఆశ్రమ స్థలంలో తాను అపార్ట్‌మెంట్‌ కట్టానని అవాస్తవాలు చెబుతున్నారు. తాను 2007లో అపార్ట్‌మెంట్‌ కట్టాను. అపార్ట్‌మెంట్‌ కట్టినప్పుడు ఆశ్రమం నిర్వాహకులు 13 ఏళ్లలో ఏ రోజు కూడా నాపై ఫిర్యాదు చేయలేదు. ఇవాళ అధికార పార్టీ నుంచి ఎంపీగా ఉన్నానని అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. తన స్థలానికి, ఆశ్రమ స్థలానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. మీ స్థలంలో అపార్ట్‌మెంట్‌ కట్టినట్లు ఏదైనా సర్టిఫికెట్‌ ఉంటే చూపించండని ఎంపీ సత్యనారాయణ అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: