ఉగ్రవాదుల స్థావరాలకు కేంద్రబిందువైన పుల్వామా లో మరోసారి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. తాజాగా మరోసారి కశ్మీర్లోని పుల్వామా ప్రాంతంలో భద్రతాదళాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు భద్రతా బలగాలు. ఉగ్రవాదులు తలదాచుకున్నారు అనే సమాచారంతో రాత్రికి రాత్రి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన సైన్యం... ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినది. వివరాల్లోకి వెళితే... దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా త్రాల్ సెక్టర్ దైవర గ్రామంలో ఎన్కౌంటర్ ఘటన చోటుచేసుకుంది. దైవరా గ్రామంలో ఉగ్రవాదులు తలదాచుకున్నరన్న కీలక సమాచారం తో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు.. నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి.
కాగా రాత్రి జరిగిన ఈ తనిఖీల్లో... ఇండియన్ ఆర్మీకి చెందిన స్పెషల్ ఫోర్స్... సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, జమ్మూ కాశ్మీర్ పోలీస్ విభాగం సంయుక్తంగా పాల్గొని నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఇక భద్రత బలగాలు నిర్బంధ తనిఖీలు చేపడుతున్న సమయంలో భద్రతా బలగాల రాకను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు... ఎదురు కాల్పులు జరిపింది. దీంతో కొంత సేపటి వరకు ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య భీంగరంగా కాల్పులు జరిగాయి. ఈ క్రమంలోనే ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినది భారత సైన్యం. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పోలీస్ విభాగానికి చెందిన ఐజి విజయ్ కుమార్ మాట్లాడుతూ... ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఘటనా స్థలంలో ఉగ్రవాదులు దాచిన భారీ పేలుడు పదార్థాలను ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. చనిపోయిన ఉగ్రవాదుల వివరాలు సేకరిస్తున్నామని అంతేకాకుండా... ఆ ప్రాంతంలో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు తలదాచుకున్నార అనే దాని పై తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. అంతకు ముందుగా ఫిబ్రవరి 5వ తేదీన కూడా శ్రీ నగర్ వద్ద ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. కాగా ఫిబ్రవరి 5న జరిగిన ఎన్కౌంటర్లో ఒక జవాను ప్రాణాలు కోల్పోగా ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టింది భారత సైన్యం. ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడడంతో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.