పెద్ద చదువులు చదివాడు... మంచి ఉద్యోగం చేస్తున్నాడు... అప్పటికే మూడు పదుల వయసు దాటి పోయింది... ఇక పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న సమయంలో సరైన సమాధానం రావడం లేదు... కుటుంబీకులు కూడా అతనికి పెళ్లి చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందాడు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని తనువు చాలించాడు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... గచ్చిబౌలిలోని సుదర్శన్ నగర్ లో నివాసముండే సన్ని బాబు అనే యువకుడు... స్థానికంగా ఉండే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఐటి ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో తన గదిలోనే సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

 

 

 అయితే అతను ఆత్మహత్య వెనుక ఉన్న కారణం పెళ్లి అన్నట్లుగా తెలుస్తోంది... పెళ్లి కావడం లేదని మనస్తాపం చెందిన  ఈ టెక్కీ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అప్పటికే మూడు పదుల వయస్సు దాటి పోయిందని... పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న సమయంలో... సరైన సంబంధాలు రాక మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా  ఈ యువకుడు చనిపోవడానికి ముందే తన బావ సంపత్ కుమార్ కు మెయిల్ ద్వారా తెలియజేశాడు. అయితే మెయిల్ ని కాస్త ఆలస్యంగా చూసుకున్న  సంపత్ కుమార్ సాయంత్రం నాలుగు గంటలకు సన్నీబాబు గది వద్దకు వచ్చి చూడగా తలుపులు వేసి ఉంది.

 

 

 దీనితో తలుపులు బద్దలు కొట్టి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు సన్నీబాబు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సన్నీ బాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక కొడుకు మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు హైదరాబాద్ చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.అయితే సన్నీబాబు మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: