మహారాష్ట్రలో ఏర్పడిన కాంగ్రెస్-శివసేన-ఎన్సీపీ సర్కారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి షాకుల పరంపర కొనసాగిస్తోంది. ఒకదాని వెంట మరొకటి అన్నట్లుగా మోదీ సర్కారును టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మానసపుత్రిక అయిన ‘ముంబై-అహ్మదాబాద్' బుల్లెట్ రైలు ప్రాజెక్టు ‘తెల్ల ఏనుగు’ వంటిదని ఇటీవలే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ప్రోత్సాహకంగా ఉంటుందని, ఆచరణ సాధ్యమని నిర్ధారణకు వచ్చాకే బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై సమగ్ర నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీనికి కొనసాగింపుగా తాజాగా భీమా-కోరెగావ్ కేసును కేంద్రానికి అప్పగించబోమని మహారాష్ట్ర సీఎం స్పష్టం చేశారు.
జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ)కి ఎల్గార్ పరిషత్ కేసు దర్యాప్తును అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామ్య పార్టీలైన ఎన్సీపీ, కాంగ్రెస్ ఉద్ధవ్ లక్ష్యంగా విమర్శలు గుప్పించాయి. దీంతో ఉద్ధవ్ ఠాక్రే స్పందస్తూ ‘2017లో పుణెలోని శనివార్వాడా వద్ద జరిగిన ఎల్గార్ పరిషత్ సదస్సు సందర్భంగా కొందరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు.. దీని ప్రభావంతో భీమా-కోరెగావ్ వద్ద హింస చెలరేగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీన్నిబట్టి ఎల్గార్ పరిషత్, భీమా-కోరెగావ్ అనేవి రెండు వేర్వేరు అంశాలు. భీమా-కోరెగావ్ కేసును కేంద్రానికి అప్పగిస్తే దళిత సోదరులకు న్యాయం జరిగే అవకాశం లేదు. కాబట్టి ఈ కేసును కేంద్రానికి అప్పగించను’ అని పేర్కొన్నారు. మరోవైపు, ఎన్పీఆర్ను మహారాష్ట్రలో అమలు చేస్తామని, దీని వల్ల నష్టమేమీ లేదని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. కాగా, ఈ నిర్ణయం బీజేపీకి షాక్ వంటిదంటున్నారు.
ఇదలిఆఉండగా, కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘బుల్లెట్ రైలు’ ప్రాజెక్టు కోసం చేపట్టిన భూసేకరణపై గిరిజనులు, రైతుల నుంచి గట్టి వ్యతిరేకత వ్యక్తం అవుతుందని అన్నారు. ‘బుల్లెట్ రైలు ప్రధాని మోదీ కలల ప్రాజెక్టు కావచ్చు. కానీ వాస్తవాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి’ అని శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సంజయ్ రౌత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉద్ధవ్ స్పష్టం చేశారు. కేంద్ర నిధుల నుంచి రాష్ర్టానికి సరైన వాటా రావడం లేదని అన్నారు. ఆ నిధులను ఇస్తే రైతుల సంక్షేమానికి ఉపయోగిస్తామని చెప్పారు.