తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏపీలో రోజు రోజుకు దిగజారుతోంది. ఆ పార్టీ సంస్థాగతంగా రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో కేవలం 23 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ 23 మంది ఎమ్మెల్యేలలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు ఇద్దరు పార్టీకి దూరమయ్యారు. ప్రస్తుతం టిడిపికి కేవలం 21 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అటు బిజెపి ఇటు జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే.
ఆ మాటకొస్తే చంద్రబాబు ఎన్నికలు ఎదుర్కొన్న ప్రతిసారి ఓడిపోతూ వచ్చారు. 2019 ఎన్నికల్లో జనసేన.. టిడిపి.. బిజెపి వేర్వేరుగా పోటీ చేసి ఓడిపోయాయి. వైసిపికి ఆ మూడు పార్టీల ఒంటరి పోరాటం కలిసి వచ్చి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఎన్నికలు ముగిసిన తరువాత బీజేపీ, జనసేన పార్టీలు తిరిగి ఒక్కటయ్యాయి. పొత్తు పెట్టుకున్నాయి. కానీ, బాబును మాత్రం దగ్గరకు రానివ్వలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు టీడీపీకి కొత్త ఫ్రెండ్ తగిలిందన్న టాక్ కూడా ఏపీ రాజకీయాల్లో వినిపిస్తోంది.
కేంద్రం తీసుకొచ్చిన సిఏఏ ను వ్యతిరేకిస్తూ వస్తున్న ఎంఐఎంకు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ సపోర్ట్ గా నిలిచింది. ఎంపీ కేశినేని నాని ఈ విషయంలో చొరవచూపినట్టుగా తెలుస్తోంది. అసలు ఎంఐఎంకు టీడీపీ బద్ధ వ్యతిరేకి. గతంలో బాబుకు వ్యతిరేకంగా కాంగ్రెస్, వైఎస్తో దోస్తీ కట్టిన ఎంఐఎం ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీకి సపోర్ట్గా ఉంటోంది.
తాజాగా సీఏఏ విషయంలో కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవలే కడపలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అలానే విజయవాడలో భారీ సభ ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. ఈ సభకు అక్బరుద్దీన్ హాజరయ్యారు. భారీ సభ జరగడం, కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడటంతో పాటుగా అవసరమైతే ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని అయినా మైనార్టీ ఓటు బ్యాంకును తమ వైపునకు తిప్పుకుని తాము అధికారంలోకి రావాలన్న ప్లాన్తోతో టీడీపీ ఉన్నట్టు కనిపిస్తోంది. మరి ఈ కొత్త పొత్తులు ఎంత వరకు టీడీపీకి కలిసొస్తాయో ? చూడాలి.