బాల్యం మూడుముళ్ల బంధంలో చిక్కుకుంటోంది. ఆడి పాడే వయసులోనే చిన్నారుల జీవితాలను సంసార ఊబిలోకి నెట్టేస్తున్నారు. బాల్య వివాహాలపై నిషేధమున్నా .. వాటిపై అవగాహన కల్పిస్తున్నా ఈ పెళ్లిళ్లు ఆగడం లేదు. ‘బేటీ బచావో, బేటీ పఢావో’ అనే నినాదం మారుమోగిపోతున్న మన దేశంలో చిన్నారులపై అకృత్యాలకు అడ్డుకట్టపడటం లేదు. సమాజంలో ఎన్ని మార్పులొచ్చినా బాల్య వివాహాలు ఆగడం లేదు. పెళ్లి పేరుతో 10-15 ఏళ్లకే బాలికాలు పుస్తెల భారం మోయాల్సి వస్తోంది. ఓ వైపు ఆర్థిక పరిస్థితులు, మరోవైపు నిరక్షరాస్యత, అవగాహన లేమి, తదితర కారణాల వల్ల ప్రతీఏటా పదుల సంఖ్యలో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి.
ఇక తాజాగా చిత్తూరు జిల్లాలోనూ ఇలాంటి దారుణమైన ఘటన జరిగింది. డబ్బు కోసం 10ఏళ్లు చిన్నారికి 50ఏళ్ళ వ్యక్తితో పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు తల్లిదండ్రులు. స్థానికుల చొరవతో సమాచారం పోలీసులకు చేరడంతో.. పెళ్లి ప్రయత్నాలను అడ్డుకుని బాలికను కాపాడారు. శ్రీకాళహస్తి రూరల్ మండలం తొండమనాడులో ఈ ఘటన బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలోని శ్రీకాళహస్తి మండలంలో ఓ గ్రామంలో 10 సంవత్సరాలు కలిగినటువంటి బాలిక తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది. అయితే అదే గ్రామంలో 50 సంవత్సరాల కలిగినటువంటి ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు.
ఆ బాలిక తల్లిదండ్రులకు సదరు వ్యక్తి మాయమాటలు చెప్పి.. డబ్బు ఆశ చూపించారు. దీంతో పెళ్లి పేరుతో అమ్మకానికి సిద్ధమయ్యారు ఆ తల్లిదండ్రులు. ఈ క్రమంలోనే పదేళ్లు కూడా నిండని చిన్నారిని 50 ఏళ్ల మాధవాచారితో పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు. అయితే పెళ్లి విషయం ఆ నోటా.. ఈ నోటా స్థానికులకు చేరింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారి పెళ్లిని అడ్డుకుని చిన్నారిని బాలసదన్కు తరలించారు. ఆ వెంటనే తల్లిదండ్రులను విచారించి వాస్తవాలు తేల్చారు. అలాగే పది సంవత్సరాలు కలిగినటువంటి బాలికను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించిన మాధవాచారి ని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.