ఏపీలో ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ పార్టీ నేతల అక్రమాలకు అడ్డూ అదుపు లేదు. పార్టీ అధికారంలో ఉండడంతో తమ వ్యాపారాలు.. రాజకీయం ఇష్ట మొచ్చినట్టు చేసుకున్నారు. అయితే ఇప్పుడు జగన్ అధికారంలోకి రావడంతో నాడు టీడీపీ వాళ్లు చేసిన అక్రమాల గుట్టు అంతా రట్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ సర్కార్ ఆపరేషన్ ప్రకాశం టీడీపీ లీడర్స్ స్టార్ట్ చేయడంతో ఆ జిల్లా టీడీపీ నేతలు విలవిల్లాడి పోతున్నారు.
కొద్ది రోజులుగా వైసీపీ ప్రభుత్వం ప్రకాశం జిల్లాలో టిడిపి నేతలకు వరుసగా షాకులు ఇస్తోంది. గ్రానైట్ తవ్వకాలకు భారీ జరిమానా విధించింది. వీరిలో బిజెపి రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు, అద్దంకి టిడిపి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ మంద్రి సిద్ధా రాఘవరావు ఉన్నారు. వీరితో పాటు చిన్నా పెద్దా పార్టీ నేతలు కలుపుకుంటే మొత్తం 56 మంది వరకు నేతలను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.
ఇక టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రకాశం జిల్లాలో గ్రానైట్ తవ్వకాలు అధికంగా జరుగుతాయి. పలువురు టిడిపి నేతలకు ఇక్కడ క్వారీలున్నాయి. వైసిపి ప్రభుత్వ ఏర్పడిన తర్వాత క్వారీలలో విజిలెన్స్ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. గత నాలుగైదు నెలలుగా ప్రతి వారం లేదా.. వారంలో రెండు మూడు రోజులు గ్రానైట్ దాడులు జరగడంతో టీడీపీ నేతలు విలవిల్లాడి పోతున్నారు.
తమ బాధ ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. ఇక సర్కార్ కడప, అనంతపురం నుండి ప్రత్యేకంగా సర్వేయర్లను తీసుకొచ్చి క్వారీల్లో జరిగిన తవ్వకాలపై కొలతలు వేశారు. పలు అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. దీంతో వారికి భారీగా జరిమానా విధించారు. తాము భారీ జరిమానా చెల్లించాల్సి రావడంతో టీడీపీ నేతలకు ముందు నుయ్యి వెనక గొయ్యి చందంగా మారింది. కొందరు మాత్రం జిల్లా వైసీపీ మంత్రులకు ఫోన్లు చేసి తమను కాపాడడాలని వేడుకుంటున్నారట.