ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు. ఆ లేఖలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఏం రసారంటే.. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా జగన్ తండ్రి వైఎస్ విషయాన్ని అరుణ్ కుమార్ ప్రస్తావించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14 ఏళ్ల క్రితమే రాజమండ్రిలో బెంచ్ పెట్టాలనే ఆలోచన చేశారని ఆయన గుర్తు చేశారు. హైకోర్ట్ బెంచ్ కు రాజమండ్రి అనుకూలమని లేఖలో అరుణ్ కుమార్ ప్రస్తావించారు. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటును పరిశీలించాలని జగన్ ను కోరారు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని ఆలోచన చేసి.. నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.
హైకోర్ట్ బెంచ్ ల వ్యవహారం పై చాలా రోజులుగా ఏపీలో చర్చ జరుగుతోందని, మూడు రాజధానుల ప్రస్తావన రాకముందు కర్నూలుతో పాటూ విశాఖలో హైకోర్టు బెంచ్ లు ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపించింది. జగన్ సర్కార్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తేవడం.. కర్నూలుకు హైకోర్టును తరలిస్తామని చెప్పడంతో సీన్ కాస్త మారింది. అమరావతితో పాటూ విశాఖలో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతోందన్నారు.
మాజీ ఎంపీ ఉండవల్లి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాసిన లేఖ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. విశాఖకు సచివాలయం తరలిస్తారు కాబట్టి.. హైకోర్ట్ బెంచ్ అయినా సరే రాజమండ్రిలో పెట్టాలని ఉండవల్లి ఆలోచనలా కనిపిస్తోంది. మరి ఉండవల్లి విజ్ఞప్తి పై ముఖ్యమంత్రి జగన్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. జగన్ స్పందించే వరకు ఈ విషయం పై వేచి చూడాల్సిందే మరి.