కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకీ విజృంభిస్తోంది. కరోనా విజృంభణతో ఇప్పటికే చైనాలో లక్ష మందికి పైగా ఈ వ్యాధి భారీన పడగా సుమారు 1500 మంది చనిపోయినట్టు అధికారిక లెక్కలు చెపుతున్నాయి. అయితే చైనా చెపుతున్న లెక్కలు చాలా తక్కువ అని.. చాలా మంది అక్కడ చనిపోయారన్న సందేహాలు ప్రపంచ దేశాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గజగజలాడిస్తోంది. కొవిడ్-19 విజృంభణ కారణంగా చైనీయులను తమ దేశాల్లోకి రానివ్వకుండా ఇప్పటికే పలు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి.
ఇప్పటికే చైనా చుట్టు పక్కల దేశాలు చైనీయులను తమ దేశాల్లోకి రానియ్యడం లేదు. ఇక ఇప్పుడు ఇదే జాబితాలోకి మరో అగ్ర దేశం రష్యా చేరింది. దీనిపై రష్యా ప్రధాని స్వయంగా నిర్ణయం తీసుకోవడాన్ని బట్టి చూస్తే రష్యా ఈ విషయంలో ఎంత సీరియస్గా ఉందో తెలుస్తోంది. చైనా దేశీయులను తమ దేశంలోకి అనుమతించకుండా ప్రధాని మిఖాయిల్ మిశుస్టిన్ తాజాగా ఈ నిర్ణయంపై సంతకం చేశారని రష్యా ఉపప్రధాని టటైనా గోలికోవా ప్రకటించారు.
ఇక కరోనా ఎఫెక్ట్ తో చైనాలో నిత్యం లక్షలాది మందితో రద్దీగా ఉండే ప్రధాన నగరాలు, పట్టణాలన్నీ గతకొన్ని రోజులుగా నిర్మానుష్యంగా మారాయి. అసలు చైనీయుల్లో చాలా మంది రోడ్ల మీదకు రావడం లేదు. వారం రోజులకు ఒకసారి ఇంట్లో నుంచి ఎవరో ఒకరు నిత్యావసరాల కోసం బయటకు వచ్చి... వాటిని కొనుగోలు చేసి మళ్లీ ఇంట్లోకి వెళ్లిపోతున్నారు. చైనా రెస్టారెంట్లు.. హోటల్స్ అన్నీ బంద్ అయ్యాయి.
చైనా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా కుదేలైంది. ఈ క్రమంలోనే రష్యా చైనా, ఉత్తర కొరియాలకు విమానాలు, రైళ్ల రాకపోకలను నియంత్రించడంతోపాటు చైనా పౌరులకు వర్క్ వీసా జారీ చేయడాన్ని రష్యా నిలిపివేసింది. రష్యాలో చదువుకునే చైనా విద్యార్థులను మార్చి వరకూ రాకూడదని ఇప్పటికే సూచించింది.