తూర్పు గోదావరి జిల్లాలో ఒకప్పుడు టీడీపీ నాయకుల హవా ఎక్కువగా ఉండేది. అయితే, గత ఏడాది ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. కాకినాడ, రాజమండ్రి ఎంపీలు సహా ఎమ్మెల్యే స్థానాల్లో రెండు మినహా అన్నింటినీ కైవసం చేసుకుంది. దీంతో ఇక్కడ వైసీపీ పుంజుకుంటుందని అనుకున్నారు. అయి తే, అనూ హ్యం ఇక్కడ వైసీపీలో కుమ్ములాటలు జరుగుతున్నాయి. తాజాగా ఈ విభేదాలు రోడ్డెక్కా యి. టీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తూర్పుగోదావరిజిల్లా రామచంద్రపురం నియోజకవర్గ పర్యటనలో వైసీపీలో వర్గపోరు బయటపడింది.
ద్రాక్షారామ భీమేశ్వరుడిని దర్శించుకుని వెంకటాయపాలెం బయలుదేరిన సుబ్బారెడ్డి, ఇన్చార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ కాన్వాయ్ను బోసు బొమ్మసెంటర్లో ఎమ్మెల్యే వేణు వర్గానికి చెందిన కార్యకర్తలు అడ్డగించారు. వైవీ ప్రయాణిస్తున్న వాహనాన్ని నిలిపివేసి నినాదాలు చేశారు. బోసు బొమ్మసెంటర్లో రాష్ట్ర లీగల్సెల్ కార్యదర్శి మాగాపు అమ్మిరాజు ప్లెక్సీని చించివేశారు. అదే విధంగా తోట త్రిమూర్తుల అభిమానులు ఏర్పాటుచేసిన ప్లెక్సీని చించివేసి తగుల బెట్టారు. త్రిమూర్తులుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. త్రిమూర్తులు డౌన్ డౌన్ అక్కడ నుంచి వెళ్లిపోవాలని వారు తమ వ్యతిరేకత ప్రదర్శించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.
కాగా.. తోట త్రిమూర్తులు వైసీపీలోకి రావడాన్ని వ్యతిరేకిస్తూ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డిని ఎమ్మెల్యే వేణు వర్గం అడ్డుకున్నట్టు సమచారం. దీంతో తూర్పు వైసీపీలో అసలు ఏంజరుగుతోంది? అనే చర్చ రాష్ట్రంలో జరుగుతోంది. ఈ ఒక్క నియోజకవర్గంలోనే కాదు పెద్దాపురంలో గత ఎన్నికల్లో ఓడిన తోట వాణికి, నియోజకవర్గ ఇన్చార్జ్ దవులూరి దొరబాబుకు అస్సలు పొసగడం లేదు. రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో ఎంపీ భరత్ వర్గంతో పాటు ఈ రెండు నియోజకవర్గాల ఇన్చార్జ్లకు పొసగని పరిస్థితి. ఇలా జిల్లా అంతటా కీలక స్థానాల్లో గ్రూపు తగాదాలు ఎక్కువుగా ఉండడంతో అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ? చూడాలి.