ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సీఏఏ, ఎన్ఆర్సీ కి వ్యతిరేకంగా తీర్మానం చేయనున్నారా?, రాష్ట్రం లో సీఏఏ, ఎన్ఆర్సీలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసేది లేదన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముస్లిం, మైనార్టీల ఆకాంక్ష మేరకు తీర్మానానికి మొగ్గు చూపుతున్నారా?? అంటే అవుననే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు పరిశీలిస్తే స్పష్టం అవుతోంది . సీఏఏ, ఎన్ఆర్సీ కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెల్సిందే . పార్లమెంట్ లో ఈ బిల్లు అధికార వైస్సార్ కాంగ్రెస్ , ప్రధాన ప్రతిపక్షం టీడీపీ లు మద్దతునిచ్చాయి .
అయితే ఆ తరువాత ముస్లిం, మైనార్టీలు ఈ రెండు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉదృతం చేయడంతో వైస్సార్ కాంగ్రెస్ ఆత్మరక్షణ లో పడినట్లు కన్పించింది . దానికితోడు తాజాగా తెలంగాణ అసెంబ్లీలోనూ సీఏఏ, ఎన్ఆర్సీ కి వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొనడంతో , వైస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రెండు చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది . ఈ మేరకు జగన్ సన్నిహితుడు సజ్జల మాట్లాడుతూ రాష్ట్రం లో తాము అధికారం లో ఉన్నామని తమను దాటి ఏ చట్టం కూడా రాష్ట్రంలో అమలు కాదన్నా ధీమాతోనే వెంటనే స్పందించలేదని అన్నారు .
ముస్లిం, మైనారిటీలు వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగమని చెప్పారు . అవసరమైతే ఆ రెండు చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ లో తీర్మానానికి రెడీ అని సజ్జల పేర్కొన్నారు . బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రాల్లోని అసెంబ్లీల్లోనే సీఏఏ, ఎన్ఆర్సీ కి వ్యతిరేకంగా తీర్మానం చేశారని , ఆంధ్ర ప్రదేశ్ లో ఆ పార్టీ తో తమకు పోటీ కానీ ... భయం కానీ లేదన్నారు . ముస్లిం లు కోరుకుంటున్నట్లుగా సీఏఏ, ఎన్ఆర్సీ కి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఆ వర్గం ప్రజల్లో వైస్సార్ కాంగ్రెస్ పట్టు మరింత పెరగడం ఖాయం .