ఆ దంపతులకు పుట్టగా.. పుట్టగా.. ఒక మగ బిడ్డ కలిగాడు. వారి సంతోషానికి అవధులే లేకుండా పోయాయి. కానీ అంతలోనే వారి ఆశలు ఆవిరయ్యాయి.. ఈ ఘటన విన్న ఎవరికైనా కన్నీళ్లు రాకుండా మానవు. అవును. మీనా దంపతులకు ముగ్గురు సంతానం. తొలుత ఇద్దరు ఇద్దరు కుమార్తెలు పుట్టగా 11 నెలల క్రితం బాబు పుట్టాడు. అల్లారు ముద్దుగా పెంచారు. కానీ మృత్యువు ఆ బిడ్డని కబళిస్తుందని వారు ఊహించలేదు.
మంచి నీళ్లు అనుకుని కిరోసిన్ తాగిన ఆ 11 నెలల బాలుడు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన నిజామాబాద్ జిల్లాలో విషాదం నింపింది. కోటగిరి మండలం వల్లభాపూర్ గ్రామానికి చెందిన సాయిచరణ్, శివరాత్రి పండగ సందర్భంగా కుటుంబ సభ్యులు గురువారం ఇంటిని శుభ్రం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే సాయివర్ధన్(11 నెలలు) ఇంట్లో ఆడుకుంటూ కట్టెల పొయ్యి వెలిగించేందుకు ఓ సీసాలో ఉంచిన కిరోసిన్ను మంచినీళ్లు అనుకుని పొరపాటున తాగేశాడు.
ఈ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు బాబును బోధన్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడినుంచి నిజామాబాద్కు తరలిస్తుండగా, మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఇద్దరు అమ్మాయిల తర్వాత పుట్టిన కొడుకు కావడంతో తల్లిదండ్రులు సాయివర్ధన్ను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు స్థానికులను కలచివేస్తోంది.
ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరగడం విచారకరం. ఆ మధ్య కరీంనగర్లో సపోటా పండు తిని నాలుగేళ్ళ బాలుడు మృతిచెందాడు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ గ్రామానికి చెందిన అనుపురం సుజాత-లింగాగౌడ్ దంపతులకు ఇద్దరు కుమారులు, అమ్మ కొన్న సపోటా పండు తిన్న రెండో కుమారుడు శివకుమార్(4) గొంతులో సపోటా గింజ ఇరుక్కుంది. దీంతో కంగారుపడిపోయిన సుజాత, కుటుంబసభ్యుల సాయంతో వెంటనే మెట్టపల్లి ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అక్కడ చికిత్స పొందుతూ శివకుమార్ మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.