రోజు రోజుకు అమ్మాయిలకి సమాజంలో రక్షణ లేకుండా పోతుంది. అమ్మాయి ఎంత గొప్ప స్థాయిలో ఉన్న వారిపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు మాత్రం ఆగటం లేదు.న్యాయదేవతకు నిలయైన కోర్టులో ఓ మహిళా లాయర్పై సహచరుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహిళలపై నేరాలకు అడ్డాగా మారిన ఉత్తర్ప్రదేశ్లో చోటుచేసుకుంది.
బహేరీ ప్రాంతానికి చెందిన ఓ యువతి రూప్ కిషోర్ అనే సీనియర్ లాయర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తోంది. అక్కడే బబ్లూ అనే యువకుడు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. సీనియర్ లాయర్ లేని సమయంలో ఓ కేసు గురించి మాట్లాడుకుందామని బబ్లూ యువతిని ఛాంబర్కు పిలిచాడు. డ్రగ్స్ కలిపి కూల్డ్రింక్ తాగించాడు. ఆమె మత్తులోకి జారుకున్నాక లైంగిక దాడికి పాల్పడి సెల్ఫోన్లో వీడియో తీశాడు.
కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళన పడిన తల్లిదండ్రులు ఆమె కోసం అనేక ప్రాంతాల్లో గాలించారు. చివరికి లాయర్ ఛాంజర్కు వెళ్లి చూడగా నగ్నంగా అపస్మారక స్థితిలో కనిపించింది. దీంతో వారు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. డ్రగ్స్ అతిగా ఇవ్వడంతో నాలుగు రోజుల వరకు బాధితురాలు కోలుకోలేకపోయింది. మెలకువ వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు తనపై జరిగిన అఘాయిత్యం గురించి వివరించింది.
తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లి తమ కూతురు జీవితాన్ని నాశనం చేసిన బబ్లూపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కోర్టుకు చేరుకుని వారిని శాంతపరిచారు. మరోవైపు బబ్లూను కొట్టిన వీడియోను కొందరు వీడియో తీసి సోషల్మీడియాలో పోస్ట్ చేయగా వైరల్గా మారింది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు బబ్లూపై అత్యాచారం కేసు నమోదు చేశారు. మరోవైపు తనను అకారణంగా యువతి తల్లిదండ్రులు కొట్టారని, వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని బబ్లూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిపై చర్యలు తీసుకుంటామని బరేలీ ఎస్పీ సన్సార్ సింగ్ తెలిపారు.