కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తాన్ని వణికిస్తుంది. ఈ వైరస్ ఒక్క చైనాలోనే కాకుండా అన్ని దేశాలకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి చాలా తొందరగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే ఈ వ్యాధితో కొన్ని వేల మంది చనిపోయారు. చైనాను కరోనా వైరస్ ముప్పు వణికిస్తోంది. సాధారణ ప్రజానీకానికే కాకుండా జైల్లో ఉన్న వారికి కూడా కరోనా వైరస్ వేగంగా సోకుతోంది. 

 

హుబేయ్ ప్రావిన్స్ వెలుపల ఉన్న రెండు జైళ్లలో 234 మందికి కరోనా వైరస్ సోకింది. జినింగ్ నగరంలోని రెన్‌చెంగ్ జైల్లో 207 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో.. ఆ ప్రావిన్స్ న్యాయ విభాగ చీఫ్‌ను పదవి నుంచి తప్పించారు. ఫిబ్రవరి 13న ఈ జైల్లో తొలి కేసు నమోదైంది. దీంతో 13 మంది జైలు అధికారులపై వేటు వేశారు.

 

కోవిడ్‌కు అడ్డుకట్ట వేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం కావడం వల్ల వారిపై వేటు వేసినట్టు షాన్‌డాంగ్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ తెలిపారు. మరోవైపు ఝెజియాంగ్ ప్రావిన్స్‌లో 27 మంది ఖైదీలకు కరోనా వైరస్ సోకింది. దీంతో సంబంధిత అధికారులకు ఉద్వాసన పలికారు. చైనాలో ఇప్పటి వరకూ 74 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదు కాగా... 2100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

 

కోవిడ్ కారణంగా వుహాన్‌లో 29 ఏళ్ల యువ డాక్టర్ ప్రాణాలు వదిలారు. డాక్టర్ పెంగ్ యిన్హువా ఫస్ట్ పీపుల్స్ హాస్పిటల్‌లో రెస్పిరేటరీ అండ్ క్రిటికల్ కేర్ విభాగంలో పని చేసేవారు. కరోనా విజృంభించడంతో ఆయన పెళ్లిని వాయిదా వేసుకొని మరీ వైద్య చికిత్స అందిస్తున్నారు. కానీ కరోనా సోకడంతో జనవరి 25న ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. పరిస్థితి విషమించడంతో జనవరి 30న అత్యవసర చికిత్స కోసం ఆయన్ను వుహాన్‌లోని జిన్యింటన్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన గురువారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: