కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఏపీ సీఎం జగన్ కు ఇబ్బంది కరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేంటంటే.. యునైటెడ్  అరబ్ ఎమిరేట్స్ లోని... ఫెడరల్ , స్థానిక కోర్టులు జారీ చేసే ఆదేశాలు,  తీర్పుల అమలుకు భారత్  ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు.. కేంద్రన్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. 

 

అంటే.. కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ - 1908లోని  44A కింద దఖలు పడిన అధికారాలను అనుసరించి యునైటెడ్  అరబ్ ఎమిరేట్స్ ని పరస్పర సహకారపూర్వక భూభాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. యునైటెడ్  అరబ్ ఎమిరేట్స్ పరిధిలోని రెండు ఫెడరల్ కోర్టులు, ఐదు లోకల్ కోర్టులను ఆ ప్రాంత ఉన్నత న్యాయస్థానాలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 

 

అంటే ఇకపై అవి జారీ చేసే ఆదేశాలు, ఉత్తర్వులను భారత దేశంలో కూడా  అమలు చేయనున్నారు. ఏదైనా డబ్బు చెల్లింపు, పన్ను బకాయిలు, జరిమానాలు, డబ్బుతో ముడిపడిన ఇతర అంశాలకు సంబంధించిన  డిక్రీ, తీర్పులు ఇందులో ఉంటాయి. లోకల్ కోర్టుల్లో అబుదాబీ జ్యుడీషియల్ డిపార్ట్మెంట్, దుబాయి కోర్టులు, రస్  అల్  ఖైమా జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నాయి.

 

అయితే ఈ నిర్ణయంతో జగన్ కు వచ్చిన ఇబ్బంది ఏంటి అనే కదా మీ సందేహం. జగన్ పై ఉన్న కేసుల్లో రస్ అల్ ఖైమాకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే నిమ్మగడ్డ నిందితుడుగా ఉన్నారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు త్వరలోనే జగన్ ను కూడా రస్ అల్ ఖైమా అరెస్టు చేస్తుందని టీడీపీ కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం జగన్ పై ప్రభావం చూపినా చూపకపోయినా... దీనిపై టీడీపీ జోరుగా ప్రచారం చేస్తుందనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: