తీగ లాగితే డొంక కదిలినట్టుగా గత చంద్రబాబు పాలనా కాలంలో జరిగిన ఈఎస్ ఐ కుంభకోణంలో పాత్రధా రులు, సూత్ర ధారుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నీతి వంతమైన పాలన అందించామని చంద్రబాబు అండ్ కోలు చెప్పుకొంటున్నా.. ఈ ఎస్ ఐలో లభించిన ఆధారాలతో పోల్చి చూస్తే.. భారీ ఎత్తున స్కామ్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో ఇద్దరు మంత్రులు అచ్చన్నాయుడు, పితాని సత్యనారాయణ.. మంత్రి కుమారుడికి కూడా పాత్ర ఉన్నట్టు సమాచారం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం సంచలనం సృష్టించింది.
మందుల కొనుగోళ్లు, ల్యాబ్ కిట్స్, బయోమెట్రిక్ మెషీన్లు, టెలీహెల్త్ సర్వీసెస్ అంశాలలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఈ కుంబకోణం తాలూకు ఆరోపణ. టెలీసర్వీసెస్కు చెందిన కాల్లిస్ట్ ఏపీది కాకుండా తెలంగాణాది ఇచ్చారని.. ఆ కాల్లిస్టును పరిశీలించగా బోగస్ అని తేలిందని అధికారులు గుర్తించారు. పేషెంట్స్ ఫోన్లు చేయకున్నా చేసినట్లు బిల్లులు చూపించారని, సీవరేజ్ ప్లాంట్లను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని ఆదోనిలోని ఆస్పత్రిని మార్చినా.. పాత ఆస్పత్రిలోని ప్లాంట్ పేరుతోనే బిల్లులు పొందారని, దీనికి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సిఫారసు చేశారని దర్యాప్తులో తేలినట్టు అధికారులు చెబుతున్నారు.
లా ఆసుపత్రుల్లో డ్రగ్స్ గోడౌన్స్కే పరిమితమయ్యాయి. అవసరానికి మించి మందులు కొనుగోలు చేశారు. చెల్లింపుల్లో కూడా నిబంధనలు ఉల్లంఘించారు. అవినీతికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించి మొత్తం నివేదికను ప్రభుత్వానికి పంపించాం. మూడు నెలల పాటు విచారణ జరిపాం. గత ఐదు సంవత్సరాలలో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయి.
ఇందులో ముగ్గురు డైరెక్టర్లు కీలక పాత్ర పోషించారు. ఓ మాజీ మంత్రి కుమారుడి పాత్ర కూడా ఉంది.. అని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా చంద్రబాబు పాలనపై తీవ్రస్థాయిలో దుమారం రేగింది. మంత్రులే కాకుండా మంత్రి కుమారుడికి కూడా పాత్ర ఉండడాన్ని ప్రస్తావించడంతో కుంభకోణం తీవ్రత మరింత పెరిగే చాన్స్ ఉందని అంటున్నారు.