తెలంగాణలో వివాదాస్పద నేతగా ముద్రపడ్డ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. రాజాసింగ్ ఇప్పటికే అనేక కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ అటు అధికార తెలంగాణ ప్రభుత్వానికే కాకుండా ఇటు సొంత పార్టీ బీజేపీతో పాటు అటు పాతబస్తీతో ఉండే మజ్లిస్కు సైతం పెద్ద తలనొప్పిగా ఉన్నారు. హిందూత్వ వాదిగా ముద్రపడ్డ రాజాసింగ్ ఏం వ్యాఖ్య చేసినా సంచలనమే అవుతోంది.
ఇక తెలంగాణ బీజేపీ నేతలు సైతం రాజాసింగ్ విషయంలో అసంతృప్తితో ఉన్నారు. దూకుడు రాజకీయాలతో ఉండే ఆయన ఇటీవల తెలంగాణలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాపులర్ అవుతున్నారు. అందుకే తెలంగాణ బీజేపీ నేతలు కూడా రాజాసింగ్ దూకుడు తమకు ఎక్కడ ముప్పు తెస్తుందో ? అన్న ఆందోళనతో ఉన్నారన్న టాక్ అయితే బీజేపీ వర్గాల్లోనే ఉంది. ఇక కొందరు టీ బీజేపీ నేతలు ఇప్పటికే రాజాసింగ్ వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బంది గా ఉన్నాయిన ఫిర్యాదు చేసినా అమిత్ షా అయితే పట్టించుకోలేదు.
ఇక తాజాగా రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో కలకలం రేపారు. హిందువుల సంతతి పెరగకుండా విదేశాలు, ఇతర మతస్థులు... ఫుడ్ ప్రొడక్ట్స్లో కెమికల్స్ కలుపుతున్నారంటూ చేసిన ఆరోపణలు హాట్టాపిక్గా మారాయి. ప్రపంచంలో ఉన్న ఇతర దేశాల వారు, ఇతర మతాల వారు మన దేశంలో హిందూ సంతతి జనాభా పెరగకుండా ఉండాలని కుట్రలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.
హిందూ సంతతి పెరగకుండా ఇతర మతస్థులు, విదేశీయులు... ఆహార ఉత్పత్తుల్లో రసాయనాలు కలుపుతున్నారంటూ రాజాసింగ్ చెప్పారు. విదేశీ ఫుడ్ ప్రొడక్ట్స్ తినడం వల్లే హిందువుల్లో చాలా మందికి పిల్లలు పుట్టడం లేదన్న రాజాసింగ్ కామెంట్స్... తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మన భారతదేశంలో హిందువు అనే వ్యక్తి లేకుండా ఉండేందుకే విదేశీ మతస్తులు ఇలా కుట్ర పన్నారంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి.