టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఈఎస్సై స్కామ్ లో ఇరుక్కుపోయారు. ఈ స్కామ్ లో ఆయన ప్రమేయం ఉందని.. ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయని వైసీపీ సర్కారు చెబుతోంది. అయితే అచ్చెన్నాయుడు బీసీ కాబట్టే వేధిస్తున్నారని టీడీపీ నేతలు కులం కార్డు బయటకు తీశారు. అచ్చెన్నాయుడు గట్టిగా ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించడం వల్లే ఆయన్ను ఈ కేసులో ఇరికిస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు.
అయితే.. బీసీల గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదంటున్నారు వైసీపీ నేతలు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బీసీలకు పెద్ద పీట వేశారని, అవినీతి బయటపెడితే బీసీలపై దాడి అంటూ టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి ఎదురుదాడి చేశారు. గత ప్రభుత్వం అవినీతి బయటకు వస్తుందని చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే చంద్రబాబు, ఎల్లోమీడియా ఆరాటమని ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి విమర్శించారు.
బీసీలకు ఇంత పెద్ద పీట వేసిన సీఎం ఏపీ చరిత్రలో జగన్ ఒక్కడే అని.. అన్న ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి.. వైయస్ జగన్ తన కేబినెట్లో ఐదుగురు డిప్యూటీ సీఎంలను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చారని గుర్తు చేశారు. జగన్ కు బీసీలంటే ఎంత ప్రేమో ఇదే సాక్ష్యమన్నారు. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు అవినీతి బయటకొచ్చిందన్న ఎమ్మెల్యే పార్థసారధి.. గత ప్రభుత్వంలో మంత్రులంతా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.
అక్రమ సొమ్ము మొత్తం చంద్రబాబు వద్దకే చేరిందని ఎమ్మెల్యే పార్థసారధి ఆరోపించారు. చంద్రబాబు పాత్రపై కూడా సిట్ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశారని పార్థసారధి మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి కోసమే పరిపాలన వికేంద్రీకరణ అని తెలిపారు. మరావతి రైతులను గత టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని ఎమ్మెల్యే పార్థసారధి మండిపడ్డారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాతే రైతులకు న్యాయం జరిగిందన్నారు.