టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి కష్టకాలం వచ్చినట్టే కనిపిస్తోంది. ఈఎస్ స్కామ్లో ఆయన పాత్రపై గట్టి ఆధారాలే లభించినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఉన్న ఆధారాలతో ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని అంటున్నారు. వైసీపీ మంత్రులు ఈ విషయాన్ని నమ్మకం గా చెబుతున్నారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఎన్ని కుట్రలు చేసిన ఈఎస్ఐ కుంభకోణం నుంచి తప్పించుకోలేరని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖమంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు.
చంద్రబాబు హయాంలో భారీ స్థాయిలో ఈఎస్ఐ కుంభకోణం జరిగిందని జయరామ్ చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా నిలువునా దోచుకుందని దుయ్యబట్టారు. ఈఐఎస్లో కుంభకోణంలో అక్రమాలకు పాల్పడినవారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అక్రమాలు చేసినవారిపై చర్యలు తీసుకోవడానికి విజిలెన్స్ విచారణకు ఆదేశించామన్నారు. మాజీమంత్రి అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డారనడానికి ఆయన రాసిన లేఖ సాక్ష్యమని చెప్పారు.
అవినీతిపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అక్రమంగా చెల్లించిన బిల్లుల సొమ్మును రికవరీ చేస్తామని, ఈ వ్యవహారంలో అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. కేవలం మూడు సంస్థలతో కుమ్మక్కై దోపిడీ చేశారని, మందుల ధరలను భారీగా పెంచేసే దోపిడీ చేశారని మంత్రి జయరాం మండిపడ్డారు
మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇదే ధీమాగా చెబుతున్నారు. అచ్చెన్నాయుడు దోపిడీపై విచారణ చేస్తే బీసీ అంటారా..ఇదేమీ న్యాయమని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని.. .అవినీతి చేసి కులాలను పైకి తీసుకొస్తున్నారని ఆయన మండిపడ్డారు. అచ్చెన్నాయుడిపై విచారణ జరిగితే..ఆయన సచ్ఛీలుడైతే, సత్యహరిశ్చంద్రుడిలా బయటకు వస్తారు. దానికి భయమెందుకు, ఉలుకెందుకని ప్రశ్నించారు.