ప్రత్యర్థి పార్టీలకు పెద్దగా బలం లేకపోయినా తెలంగాణ రాష్ట్రంలో మీడియాకు కావాల్సినన్ని వార్తలు టీఆర్ఎస్ నేతలే ఇస్తుంటారు. నేతల అలకలు, కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణ, కేటీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం లాంటి వార్తలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండి వారుస్తుంటారు మన నేతలు. ఈ వారం కూడా అలాంటి వార్తలు కొన్ని మీడియాలో సందడి చేశాయి.
బయో ఆసియా సదస్సులో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మధ్య జరిగిన డైలాగ్ వార్ లో టీఆర్ఎస్ నేషనల్ పార్టీ కావాలని కేటీఆర్ అనడం.. కేంద్ర మంత్రి వెల్ కమ్ చెప్పడంతో కేసీఆర్ ఇక జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతారని భావిస్తున్నారు పార్టీ వర్గాలు. కేటీఆర్ సీఎం అయితే.. కేసీఆర్ ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్లనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబులకు మించి కేంద్రంలో చక్రం తిప్పాలని కలలు కంటున్నారట గులాబీ బాస్. ఇప్పటికే కేసీఆర్ చేతిలో ఫెడరల్ ఫ్రంట్ అనే ప్రతిపాదన కూడా ఉంది. ఇక దీన్ని యాక్టివ్ చేయడం.. లేదంటే బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ఏకంగా ఓ జాతీయ పార్టీనే స్థాపిస్తే ఢిల్లీలో చక్రం తిప్పగలరని అంచనా వేస్తున్నారట.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కు సంబంధించి కూడా ఓ వార్త మీడియా సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. ఈ సారి తెలంగాణ ప్రభుత్వం లక్షా యాభై వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీనికి అదనంగా భూముల అమ్మకం ద్వారా వచ్చే రెవెన్యూ కూడా కలిసి రాబోతోంది. మొత్తానికి వాస్తవ ఆర్థిక పరిస్థితులు, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ సారి బడ్జెట్ రూపకల్పన జరుగుతోందంటున్నారు అధికారులు. అయితే ఈ వార్తల్లో నిజమెంత అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.