మాఫియా డాన్ రవి పూజారి గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఫుజారి స్వస్థలం కర్ణాటకలోని ఉడుపి జిల్లాలోని పడబిద్రి. వీరి కుటుంబం పుజారి యుక్త వయస్సులో ఉన్నప్పుడే ముంబైకి షిఫ్ట్ అయింది. అంధేరీలో క్రిమినల్ గా పోలీస్ రికార్డులకెక్కాడు. గ్యాంగ్ స్టర్ బాలా జల్టీని చంపిన తర్వాత తనను తాను అండర్ వరల్డ్ డాన్ గా ప్రకటించుకున్నాడు.
గత కొన్నేళ్లుగా పూజారి పోలీసులకు చిక్కకుండా పరారీ ఉన్నాడు. మాఫియా గ్యాంగ్ స్టర్ రవి పూజారిని త్వరలోనే భారత్కు రప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత ప్రభుత్వం అతన్ని తిరిగి దేశానికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుందని సమాచారం అందింది. ఈ మేరకు రా అధికారుల సహాయంతో కర్నాటక పోలీసులు రవి పూజారీని తీసుకువచ్చేందుకు సెనెగల్ దేశానికి వెళ్లారు. కర్నాటక పోలీసులు మాట్లాడుతూ.. బెంగళూరులోనే రవి పుజారిపై 39 కేసులు ఉన్నాయి. వాటిలో 2007లో షబ్నమ్ డెవలపర్స్ యజమానులు శైలాజా, రవిల హత్య కేసుతోపాటు మంగళూరులో 36, ఉడిపిలో 11, మైసూరు, హుబ్బల్లి-ధార్వాడ్, కోలార్, శివమొగ్గలో ఒక్కో కేసు ఉన్నట్లు తెలిపారు.
20 ఏళ్ల క్రితం ఇండియా నుంచి పారిపోయిన రవి పూజారి ఆఫ్రికాలోని సెనెగల్ దేశానికి వెళ్లి ఆంటోని ఫెర్నాండెజ్గా పేరు మార్చుకున్నాడు. గతేడాది జనవరి 2019లో బార్బర్ షాపుకు వెళ్లిన రవి పూజారిపై అనుమానించిన సెనెగల్ పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. బెయిల్పై బయటికి వచ్చిన రవి పూజారి అక్కడి నుంచి వేరే చోటికి పారిపోయాడు.
గతంలో ఛోటారాజన్, దావూద్ ఇబ్రహీంలతో కలసి పనిచేసిన పుజారీ.. తర్వాత సొంత గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని హత్యలు,బెదిరింపులకు పాల్పడినట్లు తేలింది. రవి పూజారి తనను బెదిరించాడని సినీ నిర్మాత మహేష్ భట్ అప్పట్లో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడం పెను సంచలనంగా మారింది. ఆ తర్వాత భట్ ను చంపడానికి కుట్ర పన్నిన రవి పూజారి ముఠాలోని కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు.