అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ పర్యటన అనేక వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా గత ఏడాది హూస్టన్లో జరిగిన హౌడీ మోదీ లాంటి సభ తరహాలో నమస్తే ట్రంప్ను నిర్వహిస్తున్నారు. ట్రంప్ రాక కోసం అహ్మాదాబాద్ నగరం అంతా సుందరీకరించడం.. భారీ భారీ కటౌట్లు పెట్టడం వంటివే కాకుండా.. నమస్తే ట్రంప్ అనే మూడు గంటల కార్యక్రమానికి 120 కోట్లు ఖర్చు చేస్తారనే వార్త ఆసక్తికరంగా మారింది. ఇవన్నీ ఇలా ఉంటే, ట్రంప్ రాక సమయంలోనే....ఓ అమెరికా దిగ్గజ సంస్థ ఏకంగా భారత ప్రభుత్వంపై కేసు వేయడం చర్చకు కారణంగా మారింది.
అమెరికా కంపెనీ వాల్మార్ట్ ఆధీనంలో పనిచేస్తున్న దేశీయ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. పలు రకాల వస్తువులపై అమెజాన్, ఫ్లిప్కార్ట్ తమ కొనుగోలుదారులకు అక్రమంగా రాయితీలు ఇస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని ఆరోపణలు రావడంతో ఆ రెండు ఈ-కామర్స్ దిగ్గజాలపై దర్యాప్తు జరుపాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గత నెలలో ఉత్తర్వు జారీ చేసింది. దీనిపై అమెజాన్ పిటిషన్ దాఖలు చేయడంతో గత వారం ఓ రాష్ట్ర కోర్టు ఆ దర్యాప్తును నిలిపివేసింది. సీసీఐ ఉత్తర్వుపై ఫ్లిప్కార్ట్ కూడా అసంతృప్తితో ఉన్నదని, అందుకే అవిశ్వాస దర్యాప్తును సవాలుచేస్తూ బెంగళూరులోని కోర్టులో ఈ నెల 18న పిటిషన్ దాఖలు చేసిందని సమాచారం. వ్యాపారంలో తాము అనుసరిస్తున్న విధానాలు పోటీని దెబ్బతీస్తున్నాయని చెప్తున్న సీసీఐ.. ఈ విషయంలో ఎలాంటి ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండానే తమపై దర్యాప్తునకు ఆదేశించిందని ఫ్లిప్కార్ట్ ఆ పిటిషన్లో ఆరోపించింది. దీనిపై వచ్చేవారం విచారణ జరిగే అవకాశముంది.
ఈ-కామర్స్ రంగంలో విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను భారత్ కఠినతరం చేస్తున్నదని ఆరోపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో తన పర్యటనను ప్రారంభంకావడానికి కొద్ది రోజుల ముందు ఫ్లిప్కార్ట్ ఈ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.