అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ట్రంప్ పర్యటనపై ప్రపంచ దేశాలు అన్ని ఎంతో ఆసక్తితో ఉన్నాయి. అగ్ర రాజ్య అధ్యక్షుడు భారత్కు వస్తుండడంతో రెండు దేశాల కీలక నేతల మధ్య ఎలాంటి చర్చలు నడుస్తాయి ? వ్యాపార, రాజకీయ రంగాలలో ఇక ఈ రెండు దేశాలు ఎలా కలిసి పయనిస్తాయన్న అంచనాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి.
ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ట్రంప్ భారత పర్యటనపై ఎంతో ఆసక్తితో ఉంటే మన దాయాది దేశం పాకిస్తాన్ మాత్రం టార్గెట్గా పెట్టుకుంది. ట్రంప్ భారత పర్యటనపై పాకిస్తాన్ ఓ కన్నేసింది. ఈ సందర్భంగా జమ్మూ- కాశ్మీర్లో ఆర్టికల్ -370 లోని నిబంధనలను రద్దు చేసిన తరువాత 2019 ఆగస్టు 5 తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయని తెలుపుతూ ట్రంప్ ను ఓ కోరిక కోరింది.
ఆ టైంలో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత్ దిగుమతులపై తీవ్ర ఆంక్షలు విధించారు. దీంతో భారత్ కన్నా పాకిస్తాన్ ప్రజలే తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పాకిస్తాన్లో రేట్లు తీవ్రంగా పెరగడంతో అక్కడ ప్రజలు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
ఇక ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు భారత పర్యటన సందర్భంగా జమ్ము- కాశ్మీర్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను భారత ప్రభుత్వంతో మాట్లాడేలా ట్రంప్ మధ్యవర్తిత్వం వహిస్తే అందుకు తాము సపోర్ట్ చేస్తామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఈషా ఫారూకి అన్నారు. రెండు దేశాల ప్రతినిధిలు కలిసిన ప్రతిసారి అమెరికా జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే ట్రంప్ ఈ సున్నితమైన అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ? అసలు దీని ప్రస్తావన తెస్తారా ? అన్నది మాత్రం సందేహమే.