వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలను కకావికలం చేస్తున్నాయి. వేరొకరితో పెట్టుకుంటున్న సంబంధాలు భార్యభర్తల్నీ, వారి పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఇక తాజాగా..  భార్యను అడ్డు తొలగించుకుని తన ప్రేయసితో సుఖంగా ఉందామనుకున్న ప్రియుడికి చుక్కెదురైంది. పథకం విఫలం కావడంతో తాను చనిపోవడమే కాకుండా, అతడి  ప్రియురాలు కూడా ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చింది.  దీంతో డాక్టర్‌కు చెందిన ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని చిక్‌మగళూరు జిల్లా కడూర్‌లో ఓ మహిళ తన నివాసంలో దారుణహత్యకు గురయ్యారు. ఈ నెల 17వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. 

 

హతురాలి పేరు కవిత. తన భర్త డాక్టర్ రేవంత్, పిల్లలతో కలిసి కడూర్‌లో నివసిస్తున్నారు. రేవంత్.. దంత వైద్యుడు. కడూర్ సమీపంలోని బిరూర్‌లో క్లినిక్‌ను నడిపిస్తున్నాడు. రేవంత్, కవితలకు ఏడేళ్ల కిందట వివాహమైంది. కవిత స్వస్థలం ఉడుపి. అయితే  వివాహానికి ముందునుంచే డాక్టర్‌ రేవంత్‌కు హర్షిత అనే యువతితో ప్రేమాయణం సాగుతోంది. పెళ్ళి తర్వాత కూడా వారి బంధం కొనసాగింది. ఇది ఇలాఉండగా హర్షిత, బీఎంటీసీ ఉద్యోగి సుధీంద్రను పెళ్ళి చేసుకుని బెంగళూరు రాజరాజేశ్వరీనగర్‌లో నివసిస్తోంది. 

 

ఇలా సాగుతుండగానే రేవంత్‌, హర్షితాల వివాహేతర సంబంధం అతడి భార్య కవితకు తెలిసింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ తలెత్తింది. గొడవ తీవ్రం కావడంతో ఈనెల 17న భార్య కవితకు ఇంజెక్షన్‌ ఇచ్చి ఆ తర్వాత గొంతుకోసి భర్త రేవంత్‌ దారుణానికి పాల్పడ్డాడు.  ఇది దోపిడీ దొంగల పనేనని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడా రేవంత్‌ను అనుమానించలేదు. ఇదిలా ఉంటే గురువారం హత్యకు సంబంధించిన నివేదిక పోలీసులకు చేరింది. అందులో కవితకు మత్తు  ఇంజెక్షన్‌ ఇచ్చి గొంతు నులిమి హత్య చేసినట్లు బయటపడింది. 

 

దీంతో రేవంత్‌ను విచారణ చేయాలని అతని ఫోన్‌కాల్స్‌ లిస్ట్‌ను కూడా తెప్పించారు. అప్పుడు భయపడిన రేవంత్‌ శుక్రవారం రాత్రి చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా బండికొప్పలు వద్ద కారు నిలిపి సమీపంలోని రైల్వే పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన ప్రియురాలు హర్షితా (32)కూడా ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇలా అక్ర‌మ సంబంధం వ‌ల్ల‌ ఒక హత్య, రెండు ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. హర్షితకు ఒక శిశువు ఉంది. ముగ్గురూ మృతి చెందడంతో వారి పిల్లలు కూడా అనాథలయ్యారు.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: