ప్రపంచంలో ఎంతో గొప్పగా చెప్పుకొని తిరుమల తిరుపతిలో ప్రతిరోజూ భక్తుల రద్దితో కోలాహలంగా ఉంటుంది. కోరిన కోర్కెలు తీర్చే వేంకటేశుడికి ప్రతినిత్యం వేల మంది భక్తులు దర్శనార్థం వస్తుంటారు. అంత గొప్ప పుణ్య స్థలం కనుకనే ప్రపంచంలో తిరుపతికి ఎంతో పేరు ప్రతిష్టలు వచ్చాయి. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి రెండో సత్రంలో సూపరింటెండెంట్ స్థాయి అధికారిగా ఉన్న ఉమాశంకర్రెడ్డి అకస్మాత్తుగా ఆత్మహత్యకు పాల్పడటం అందరినీ షాక్ కి గురి చేసింది. ఉమాశంకర్రెడ్డి బలవన్మరణం వెనుక తిరుమలలోని ఓ ఉన్నతాధికారి వేధింపులే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ ఉమాశంకర్రెడ్డి సూసైడ్ నోట్ రాసినట్లుగా తెలుస్తోంది.
అయితే.. ఈ సూసైడ్ నోట్ను బయటపెట్టకపోవడం, ఆగమేఘాలమీద పోస్ట్ మార్టం పూర్తి చేయడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పథం దర్శనం టికెట్ల మంజూరిలో ఉమా శంకర్రెడ్డికి తిరుమలలోని ఓ టీటీడీ ఉన్నతాధికారి అందిరి ముందే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా తాను నిజాయితీగా వ్యవహరిస్తానని.. ఎవరి విషయంలోనే తాను తల దూర్చను.. తన విషయంలో ఎవరూ తల దూర్చవొద్దని ఖరాఖండిగా చెప్పినట్లు సమాచారం. దీంతో అతన్ని ఛైర్మన్ కార్యాలయం నుండి బదిలీ వేటు వేశారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఆర్జితం కార్యాలయం, మార్కెటింగ్ విభాగం, బోర్డ్ సెల్, ఛైర్మన్ క్యాంప్ ఆఫీస్, తదితర విభాగాల్లో విధులు నిర్వర్తించిన ఉమాశంకర్రెడ్డి… ఇలా ఆత్మహత్యకు పాల్పడటం టీటీడీ ఉద్యోగులను దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఈ విషయం తెలుసుకున్న సహ ఉద్యోగులు షాక్ కి గురి అయ్యారు. ఇదిలా ఉంటే.. తిరుమల ఉన్నతాధికారి కార్యాలయంలో సీసీగా పనిచేసే సురేష్ అనే టీటీడీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటను ఉద్యోగులు నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు. నిజాయితీగా ఉంటున్న వారికి ఇలాంటి మరణాలు ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.