ఆలయ నిర్మాణం కోసం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రస్టును ఏర్పాటు చేస్తున్నట్లు లోక్సభలో ఇటీవలే ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. రామాలయం అభివృద్ధి కోసం ట్రస్టు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే, ఎప్పుడు ఆ ట్రస్టు ఏర్పాటవుతుంది? ఎంత కాలం నిర్మాణానికి పడుతుంది అనే స్పష్టత వెలువడలేదు. తాజాగా ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరీజీ మహరాజ్ జైపూర్లో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అయోధ్యలో రామాలయం నిర్మాణం పూర్తికావడానికి మూడు నుంచి మూడున్నరేండ్ల సమయం పడుతుందని తెలిపారు.
‘అక్షర్ ధామ్ నిర్మాణానికి మూడు ఏళ్లు పట్టింది. గుజరాత్లోని ఐక్యతా విగ్రహాన్ని మూడు సంవత్సరాల్లో నిర్మించారు. ఇదే విధంగా మూడు నుంచి మూడున్నరేండ్ల సమయంలో గొప్ప రామ మందిరాన్ని నిర్మిస్తామని భావిస్తున్నాం’ అని తెలిపారు. మందిర నిర్మాణం కోసం భక్తులు ఇచ్చే విరాళాల్ని స్వీకరిస్తారా? అన్న ప్రశ్నకు గిరీజీ స్పందిస్తూ.. ‘మందిరం నిర్మాణం కోసం అప్పట్లో ఇటుకలను పంపిన భక్తులు.. ఇప్పుడు అదే మందిరం నిర్మాణం కోసం విరాళాలు పంపొచ్చు’ అని చెప్పారు.
కాగా, ట్రస్టు ఏర్పాటుపై ప్రధాని మోదీ స్పందిస్తూ నూతన ట్రస్టుకు శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్రం అని పేరు పెట్టినట్లు చెప్పారు. క్యాబినెట్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు సంతోషిస్తున్నట్లు చెప్పారు. శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్రం.. స్వతంత్య్ర సంస్థగా పనిచేస్తుందన్నారు. రామ మందిరాన్ని సందర్శించే భక్తుల కోసం మరో భారీ నిర్ణయం తీసుకున్నట్లు మోదీ చెప్పారు. మందిరం వద్ద ఉన్న 67 హెక్టార్ల భూమిని ట్రస్టుకు కేటాయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలో జీవిస్తున్న ప్రతి మతానికి చెందిన వారు ఉన్నతంగా జీవించాలన్నదే తమ ఉద్దేశమన్నారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్దులు, పార్సీలు, జైనులు అందరూ ఒక కుటుంబంలో భాగమని, కుటుంబంలో ప్రతి ఒక్క సభ్యుడి అభివృద్ధిని కాంక్షిస్తున్నామని అన్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్ అన్న విధానంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని, ఆ విధానం వల్ల అందరూ సంతోషంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని ప్రధాని తెలిపారు.