తాజాగా ఓ దమ్మున్న పత్రికలో వచ్చిన వ్యాసం జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూనే ఓ ఆసక్తికర విషయాన్ని ఎలాంటి ఇబ్బందీ లేకుండా వెల్లడించేసింది. అదే.. జగన్ పాలనను పక్కనపెట్టి.. తెలుగు సినిమాలను ప్రమోట్ చేసే పనిలో పడ్డారని! ఆశ్చర్యంగా అనిపించినా.. సదరు పత్రికకు ఉన్న క్రెడిబిలిటీని బట్టి నిజమనే అనుకోవాలి. ప్రతి వారం ఈ పత్రికలో రాసే ఓ వ్యాసంలో జగన్ పాలనపై ఇటీవల కాలంలో వివిధ వ్యాసాలు వస్తున్నాయి. వీటిలో పస ఉన్నా లేకున్నా.. కొంత ఆసక్తి మాత్రం ఉంటుంది. దీంతో ఈ వ్యాసం చదివి ఆనందించేవారు కూడా ఉన్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈ పత్రికలో వచ్చిన వ్యాసంలో జగన్ ప్రభుత్వం తెలుగు సినిమాలను ప్రమోట్ చేస్తున్నారని రాశారు. అది కూడా సంక్రాంతి సీజన్లో వచ్చిన సినిమాలను జగన్ పనిగట్టుకుని ప్రజలకు డబ్బులిచ్చి చూసేలా ప్రోత్సహించారని ఈ పత్రిక రాసిన వ్యాసం సారాంశం. ``జగన్ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకం వల్ల పేదల పిల్లలకు మెరుగైన విద్య లభిస్తుందా? అంటే ఆచరణలో అదీ కనిపించడం లేదు. సంక్రాంతి పండుగకు ముందు లబ్ధిదారులకు 15 వేల వంతున బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
ఆ డబ్బు వచ్చిపడటంతో అప్పుడే విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’.. సినిమాలు ఆంధ్రాలో ఆశించిన దానికంటే ఎక్కువ విజయవంతం అయ్యాయని ఒక బడా నిర్మాత వివరించారు. అంతేకాదు.. జనం దగ్గర డబ్బు ఉందని గ్రహించిన వస్త్ర దుకాణాలవారు పండగ సందర్భంగా ఇచ్చే డిస్కౌంట్లను ఎత్తేశారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే!`` - అని ఈ వ్యాసం పేర్కొంది. దీనిని చదివిన వారు అమ్మ జగనా! నువ్వు తెలుగు సినిమాలను కూడా ప్రమోట్ చేసే పనిచేస్తున్నావా? అని అనుకుంటారని ఈ వ్యాసం ఉద్దేశం అయితే అయి ఉండొచ్చు!
కానీ, ఇక్కడ చిన్న లాజిక్ మిస్సయ్యారని అంటున్నారు విశ్లేషకులు. ఇంత పెద్ద వ్యాసంలో.. ఈ విషయాన్ని జోడించి.. జగన్ ఉద్దేశాన్ని నీరుగార్చడమే పనిగా పెట్టుకున్నారని, అయితే, తెలుగు సినిమాలు కేవలం పేదలు చూస్తేనో.. లేదా ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాల నిధులతో చూస్తారనో ఏ నిర్మాతా చూడరు. ఇదే నిజమైతే.. ప్రభుత్వాలు ఇచ్చే డబ్బులు ఎప్పుడె ప్పుడు వస్తాయో.. చూసుకుని నిర్మాతలు ప్లాన్ చేసుకుని, అప్పుడప్పుడే సినిమాలు విడుదల చేసేందుకు చూస్తారు. కానీ, అలా ఇండస్ట్రీ చేయడం లేదుకదా?! ప్రజల చేతుల్లోకి డబ్బులు వెళ్లిన తర్వాత ఆ నిధులను ఎలా ఖర్చు పెట్టుకోవాలనేదివారి ఇష్టాన్ని బట్టి ఉంటుందే తప్ప.. తెలుగు సినిమాలు విడుదలయ్యాయి కాబట్టి.. అనే ధోరణితో ఉండదు.
అలా అనుకుంటే.. గతంలో ఎన్నికల సమయంలో చంద్రబాబు పసుపు-కుంకుమ పేరుతో.. మహిళలకు రూ.పది వేల చొప్పున పంచారు. ఈ నిధులతో వారు... అప్పట్లో నగలు చేయించుకున్నారని వార్తలు వచ్చాయి. అంతమాత్రాన నగల దుకాణాల వారు.. తర్వాత తమ వ్యాపారం మానేసుకున్నారా ? ఇలా ఔచిత్యం లేని విషయాలను జోడించి.. ప్రభుత్వాలపై బురదజల్లడం వల్ల పత్రిక విలువ పడిపోతుందనే విషయాన్ని గమనిస్తే.. మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతుండడం గమనార్హం.