దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల కోలాహాలం మొదలైంది. ఏప్రిల్లో ముగియనున్న రాజ్యసభ సీట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఉదయం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 17 రాష్టాల నుంచి 55 మంది రాజ్యసభ సభ్యులు రిటైర్మెంట్ కానున్నారు. అందులో ఏపీ నుంచి నాలుగు, తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇక ఎన్నికల షెడ్యూల్ ఇలా ఉంది. మార్చి 6వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా, మార్చి 13వ తేదీ నామినేషన్లకు చివరి తేది. మార్చి 26న పోలింగ్ జరుగనుండగా...అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగే నాలుగు రాజ్యసభ స్థానాలు అధికార వైసిపి ఖాతాలో పడుతుండడంతో వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు పలువురు నేతలు పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను శాసన మండలి రద్దు చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించడంతో వైసీపీ నుంచి శాసనమండలి పై ఆశలు పెట్టుకున్న వారికి ఇప్పుడు రాజ్యసభ ఒకటి మాత్రమే ఆప్షన్ గా ఉంది. అయితే సీఎం జగన్ గత ఎన్నికలకు ముందే సుమారు 30 మంది నేతలకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు.
గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ తో పాటు మంత్రి పదవి సైతం ఇస్తానని బహిరంగంగా ప్రకటించారు. ఆశావాహులు ఎంత మంది ఉన్నా జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజ్యసభకు వెళ్లే అభ్యర్థుల విషయంలో ఓ క్లారిటీకి వచ్చారంటున్నారు. మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లలో ఎవరో ఒకరు బీసీ కోటాలో రాజ్యసభకు వెళ్లనున్నారట. ఇక టిక్కెట్ త్యాగం చేసిన పారిశ్రామిక వేత్త ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి సైతం రాజ్యసభ ఖరారైందంటున్నారు. ఇక బీసీ కోటాలో నెల్లూరు జిల్లాకు చెందిన కావలి మాజీ ఎమ్మెల్యే, ఇటీవల వైసీపీలో చేరిన బీద మస్తాన్రావు పేరు కూడా దాదాపు డిసైడ్ అయ్యిందని టాక్. ఇక నాలుగో అభ్యర్థి ఎవరన్న దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.