పిల్లలపై ఎంతో నమ్మకంతో వారి ఉన్నత విద్యకోసం తల్లిదండ్రులు కాస్త ఇబ్బంది పడ్డా వారిని దూరంగా ఉంచి మంచి హాస్టల్స్ లో విద్యాబుద్దులు చెప్పిస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తలు తీసుకొని సెక్యూరిటీ గల హాస్టల్స్ లో తమ పిల్లలను విద్యాభ్యాసం పూర్తి చేయిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో తమకు స్వేచ్ఛ ఉందని.. తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని కొంత మంది అమ్మాయిలు బరితెగించిన చేస్తునన్న పనుల వల్ల అటు తోటి విద్యార్థినులు.. ఉపాధ్యాయులు చివరికి ఎంతో నమ్మకాన్ని పెంచుకున్న తల్లిదండ్రులు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి నెలకొంటుంది. ఒక్కరు తప్పు చేసినా.. అందరికీ ఆ ఎఫెక్ట్ పడుతుందన్న కనీస బుద్దీ జ్ఞానం లేకుండా నిర్లజ్జగా కొంత మంది అమ్మాయిలు చేస్తున్న అకృత్యాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి.
నూజివీడు ట్రిపుల్ ఐటీలో లేడీస్ హాస్టల్లోకి యువకుడు చొరబడిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రిపుల్ ఐటీలో భద్రత కరువైందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే.. ఆ విద్యార్థిని అనుమతితోనే ఆ యువకుడు రూమ్ లోకి వెళ్లినట్లు సమాచారం. అందుకు మిగతా అమ్మాయిలు కూడా సహకరించారట.. దాంతో వారందరినీ సస్పెండ్ చేసింది కళాశాల యాజమాన్యం. తాజాగా ఇలాంటి ఘటనే తెలంగాణలోకూడా జరిగింది. ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలంలోని ఓ లేడీస్ హాస్టల్లోకి ఈ నెల 17న మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఓ యువకుడు చొరబడ్డాడు. స్నేహితురాలి గదిలో రాత్రంతా గడిపాడు. వారు ఇద్దరూ కుమురం భీం జిల్లాలోని ఒకే గ్రామానికి చెందినవారని, వారి మధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని సమాచారం.
అయితే వీరిద్దరినీ కలిపేందుకు సహ విద్యార్థినులు కూడా సహకరించారట. హాస్టల్ సిబ్బంది గదిని శుభ్రం చేయడానికి రాగా ఆ యువకుడిని గమనించి ప్రిన్సిపాల్కు సమాచారం అందించారు. దీంతో ఆయన ఎంఈవో దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం. కాగా, వీరికి సహకరించిన మరో ముగ్గురిని కూడా కాలేజీ నుంచి సస్పెండ్ చేసి, వారి తల్లిదండ్రులకు అప్పగించినట్టు ప్రిన్సిపాల్ తెలిపారు.