దేశరాజధాని ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలు హింసకు దారితీసిన నేపధ్యంలో ఇవి ఇతర ప్రాంతాలకు వ్యాపించే అవకాశాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద ఎత్తున గొడవలు జరుగుతన్న ప్రాంతాన్ని రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూంబింగ్ చేస్తోంది. వరుసగా మూడవ రోజు కూడా అల్లర్లు చోటుచేసుకోవడంతో.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తమ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బ్రహ్మపురి ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న ఆర్ఏఎఫ్ దళాలకు.. వాడిన బుల్లెట్లు లభించాయి. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ఢిల్లీ శాంతిభద్రతల అంశంపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాగా, సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన హింసాకాండలో ఒక హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు పౌరులు మరణించగా, డీసీపీ సహా 50 మంది గాయపడ్డారు.
ఇదిలా ఉంటే.. సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన ఆందోళనలు హింసకు దారి తీశాయి. ఇళ్లకు, షాపులకు, వాహనాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. రెండు వర్గాలవారు ఒకరిమీద మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ నేపధ్యంలో పోలీసులు అక్కడ గుమిగూడిన ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అనేక ప్రాంతాల్లో 144వ సెక్షన్ను విధించారు. హింసాత్మక ఘటనలపై సంచలన కామెంట్లు చేశారు కిషన్ రెడ్డి. ట్రంప్ పర్యటన సందర్భంగా అల్లర్లకు కుట్ర జరిగిందని ఆరోపించారు. కొందరు కావాలనే హింసను ప్రేరేపిస్తున్నారని చెప్పారు. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు సీఏఏతో ఎలాంటి నష్టం లేదని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు మత విద్వేషాలతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారని…..తప్పుడు ప్రచారాన్ని, మాటలను నమ్మొద్దని కోరారు.
మేడీ దేశ ప్రతిష్టను పెంచే ప్రయత్నం చేస్తుంటే.. ట్రంప్ వచ్చిన టైంలో ఆందోళనలు చేయడం ఏంటని ప్రశ్నించారు. శాంతిభద్రతలు పునరుద్దరించాలంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఇంటి ముందు ఆప్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఏదేమైనా.. ట్రంప్ పర్యటన సందర్భంలో ఢిల్లీలో హింస చోటు చేసుకోవడం చర్చగా మారింది. ఇలా హింసాత్మక సంఘటనలు జరుగుతున్నా.. ప్రాణాలు పోతున్నా ప్రభుత్వ ఎందకు స్పందించడం లేదని ప్రతిపక్షనేతలు ప్రశ్నిస్తున్నారు.