మాతో పాటు ఉద్యమాల్లో పాల్గొనండి..
ప్రజా చైతన్య యాత్రను ఆశీర్వదించండి..
నా పోరాటం నా కోసం కాదు. జనాలు అర్ధం చేసుకుని పోరాటంలో మాతో చేతులు కలపండి... రండి బాబు రండి ప్లీజ్...
ఇవి ప్రజా చైతన్య యాత్రలో భాగంగా చంద్రబాబానాయుడు కుప్పంలో జరిగిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు. అంటే ఇక్కడ అందరికీ అర్ధమవుతున్నది ఏమిటంటే చంద్రబాబు మొదలుపెట్టిన యాత్రలకు జనాల్లో స్పందన కనబడటం లేదని. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండో నెల నుండే అవినీతి ఆరోపణలు, విమర్శలు, ఆందోళనలు, నిరసనలు మొదలుపెట్టేశారు. చివరకు తొమ్మిది నెలలు కూడా కాకుండానే ప్రజా చైతన్య యాత్రలంటూ మొదలుపెట్టేశారు.
నిజానికి చంద్రబాబు లేదా టిడిపి నేతలు లేకపోతే పచ్చమీడియా చెబుతున్నట్లుగా జనాల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత లేదన్నది వాస్తవం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా జనాల్లో ఎక్కడో ఒకచోక అసంతృప్తి మామూలే. అలాగే ఎక్కడో ఓ చోట అవకతవకలు జరుగుతునే ఉంటుంది. ఎక్కడో జరిగిన దాన్ని పట్టుకుని మొత్తం జనాలంతా వైసిపి ప్రభుత్వంపై మండిపోతున్నారని, తిరుగుబాటు చేస్తారని చెప్పటమే విచిత్రంగా ఉంది.
ఇక్కడ ఓ విషయం స్పష్టంగా అర్ధమైపోతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. కానీ అదేమీ సాధ్యం కావటం లేదు. ఎందుకంటే అమరావతి పేరుతో స్వయంగా చంద్రబాబే ఆందోళనలు చేస్తే జనాలు పెద్దగా పట్టించుకోలేదు. గడచిన తొమ్మిది నెలలుగా అనేక ఆరోపణలతో చంద్రబాబు జనాలను ఎంతగా రెచ్చగొట్టాలని చూస్తున్నా సాధ్యం కావటం లేదు. చంద్రబాబు మీడియా కూడా ఎంతగా ప్రయత్నం చేస్తున్నా ఉపయోగం కనబడలేదు.
దాంతో ఇపుడు ప్రజా చైతన్య యాత్రలతో తాము జనాల్లో చైతన్యం తీసుకొస్తామని చెబుతున్నారు. తొందరలోనే జగన్ పై జనాల్లో తిరుగుబాటు మొదలవుతుందని కూడా చెప్పేస్తున్నారు. అంటే జగన్ పై జనాలు తిరగబడాలని చంద్రబాబు ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్ధమైపోతోంది. మొత్తానికి తన యాత్రల్లో చంద్రబాబు ఇలా తృప్తి పడిపోతున్నారన్నమాట.