అంగారకుడు.. మనకు చందమామ తర్వాత అంత దగ్గరగా ఉన్న గ్రహం. ఇప్పటి వరకూ మనిషి చంద్రుడిని చేరుకున్నాడు. కానీ ఆ తర్వాత ఇతర గ్రహాలను చేరుకోలేదు. కాకపోతే.. మనిషి చేరుకోకపోయినా మనిషి పంపిన ఉప గ్రహాలు మాత్రం అంగారకుడిని చేరుకున్నాయి.
ఇక తాజాగా అంగారకుడి గురించి నాసా కొన్ని సంచలన విషయాలు వెల్లడించింది. అంగారకుడిపై ప్రయోగాల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్ధ నాసా ప్రయోగించిన ఇన్సైడర్ లాండర్ ఈ కొత్త విషయాలను కనిపెట్టింది. 2018 నవంబర్లో అంగారకుడి ఉపరితలంపై దిగిన ఇన్సైడర్ లాండర్ అక్కడి భూమి కంటే ఎక్కువ ఒత్తిడి, వాతావరణంలో వేగంగా మార్పులు వస్తాయని గుర్తించిందట.
ఇన్ సైడర్ ల్యాండర్ ల్యాండ్ అయిన నెల రోజుల తర్వాత అంగారకుడిపై బలమైన ధూళి తుపాను ఏర్పడినట్లు, దాని వల్ల అంగారకుడి వాతవరణంలో మార్పులు చోటు చేసుకున్నట్లు తెలిపింది. అంతే కాదు.. కాలానుగుణంగా ఏర్పడే శీతల కాలం వల్ల ప్రతి నిత్యం గాలిలో మార్పులు వస్తున్నట్లు తెలిపింది.
అంగారకుడి మీద మానవుడి వినికిడి సామర్ధ్యానికి అందని శబ్దాలను ఇన్సైడర్ లాండర్ గుర్తించినట్లు నేచర్ జియోసైన్స్ పత్రిక తెలిపింది. ఆయా పరిణామాలపై శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకూ అందుతున్న విషయాలను బట్టి చూస్తే అంగారకుడు మనిషి నివాసానికి అనుకూలమైన గ్రహమేమీ కాదనే చెప్పాలి.