మ‌న అధికారుల తీరు ఒక్కోసారి చిత్ర విచిత్రంగా ఉంటుంది. వాళ్లు క‌నీసం స్పృహ‌లో ఉండి ప‌ని చేస్తారా ? అన్న సందేహాలు క‌లుగుతాయి. ఏపీలో మొన్న వెంకటేష్‌కు ఓటర్ ఐడీ కార్డు వచ్చినట్లే... ఇప్పుడు తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు జగనన్న దీవెన కార్డు జారీ చేశారు అధికారులు. క‌ర్నూలు జిల్లాలో ఒక్క చోట కాదు ఏకంగా రెండు చోట్ల మ‌హేష్ బాబుకు ఈ కార్డులు జారీ చేశారు. క‌ర్నూలు జిల్లాలోని ప‌త్తికొండ‌, ఎమ్మిగ‌నూరులో చ‌దువుతున్న ఇద్ద‌రు విద్యార్థుల ఫొటోల స్తానంలో మ‌హేష్‌బాబు ఫొటో పెట్టి మ‌రీ అధికారులు జ‌గ‌న‌న్న విద్యాదీవెన కార్డు జారీ చేశారు.



కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో లక్ష్మీ అనే విద్యార్థికి అధికారులు ఇష్యూ చేసిన విద్యా దీవెన కార్డులో మహేష్ బాబు ఫోటో ఉంది. ఈ ఫొటో చూసిన ఆ విద్యార్థితో పాటు కుటుంబ స‌భ్యులు ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. ఎమ్మిగ‌నూరులో సిద్ధార్థ్ కాలేజ్‌లో చ‌దువుతోన్న ల‌క్ష్మీ ఫొటోకు బ‌దులుగా మ‌హేష్‌బాబు ఫొటో ఉంది. ఇక ఇదే జిల్లాలోని పత్తికొండలోనూ కూడా ఓ విద్యార్థికి ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది.



ప‌త్తికొండ వైష్ణ‌వి డిగ్రీ కాలేజ్‌లో డిగ్రీ చ‌దువుతోన్న లోకేష్ గౌడ్ ఫొటోకు బ‌దులుగా మ‌హేష్ బాబు ఫొటో ఉండ‌డంతో అంద‌రూ అవాక్క‌య్యారు. ఈ రెండు విద్యార్థుల ఫొటోల‌కు బ‌దులుగా మ‌హేష్ బాబు ఫోటోలు ఉన్న కార్డులు వైర‌ల్ అయ్యాయి. సోష‌ల్ మీడియాలో అధికారుల తీరుపై ప‌లువురు సెటైర్లు వేస్తున్నారు. దీనిపై అధికారుల‌ను ప్ర‌శ్నిస్తే త‌మ త‌ప్పేం లేద‌ని.. అంతా స‌చివాల‌య అధికారులే ఈ కార్డులు త‌యారు చేశార‌ని వారు త‌ప్పించుకోవ‌డం విశేషం.



ఇటు హీరో మ‌హేష్ బాబు ఫొటోల‌తో విద్యా దీవెన‌క కార్డులు జారీ చేయ‌డంతో సినీ అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. ఇదెక్క‌డి విచిత్రం రా బాబు క‌నీసం మ‌హేష్ బాబు ఫేస్ తెలియ‌ని అధికారులు కూడా ఉంటారా ? అని వారు ఆశ్చ‌ర్య పోతున్నారు.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: