రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఎదురు చూస్తున్న రాజ్యసభ సీట్లకు సంబంధించిన ఎన్నికల పండుగ వచ్చే సింది. తాజాగా విడుదలైన నోటిఫికేషన్ ఆశావహుల్లో ఉత్సాహాన్ని పెంచింది. రాజ్యసభ సెక్రటరీ జనరల్ మంగళవారం ఈ నోటిఫికేషన్ను విడుదల చేశారు. దీని ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 55 రాజ్యసభ సీట్లు వచ్చే నెలలో ఖాళీ అవుతున్నాయి. వీటికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. దీంతో ఏపీ అధికార పార్టీలో పండుగ వాతావరణం నెలకొంది.
తాజాగా విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణలో రెండు స్థానాలు, ఏపీలో నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ మొత్తం స్తానాలు అధికార పక్షాలకే దక్కుతుండడం గమనార్హం. తెలంగాణ, ఏపీల్లో అధికార పక్షం భారీ సంఖ్యాబలంతో ఉండడంతో ఓటింగ్ జరిగినా.. కూడా ఆయా అధికార పార్టీలకే ఈ సీట్లు దక్కనున్నాయి. తెలంగాణలో రెండు స్థానాల్లో కేవీపీ రామచంద్రరావు(కాంగ్రెస్), గరికిపాటి మోహన్రావు(ప్రస్తుతం బీజేపీ)లో ఉన్నారు. వీరి పదవి కాలం పూర్తయింది.
ఇక, ఏపీలో ఎంఏ ఖాన్, సుబ్బిరామిరెడ్డి(కాంగ్రెస్), కే కేశవరావు(టీఆర్ ఎస్), తోట సీతారామలక్ష్మి(టీడీపీ)ల సీట్లు ఖాళీ అవుతున్నాయి. దీంతో వైసీపీ ఆశావహులు ఉవ్విళ్లూరుతున్నారు. జగన్ను ప్రసన్నం చేసుకునేందుకు అప్పుడే వారు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, ఇప్పటికే ఒకటి రెండు సీట్లను జగన్ ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇదిలావుంటే, వచ్చే నెల 6న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 16న నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 26న పోలింగ్ ఉంటుంది అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా ఉండనుంది.
ఇక ఏపీలో అధికార పార్టీ ఖాతాలోనే నాలుగు రాజ్యసభ స్థానాలు పడనున్నాయి. దీంతో ఆ పార్టీలో పెద్ద పండగ వాతావరణం నెలకొంది. రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్న వారితో పాటు వారి అనుచరగణంలో సంబరాలు స్టార్ట్ అయ్యాయి. అయితే అదే టైంలో ఓ వైపు మండలి రద్దు కావడంతో ఈ సీట్లపై ఆశలు పెట్టుకున్న వారి లిస్ట్ ఎక్కువుగా ఉండడంతో ఇప్పుడు వీరిలో ఎవరికి పదవులు ఇవ్వాలో అని జగన్కు పెద్ద టెన్షన్ స్టార్ట్ అయ్యింది.