తెలుగులో ఓ సామెత ఉంది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు-అని! ఇప్పుడు టీడీపీలో నెంబర్-2 నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాజకీయం కూడా అచ్చు అలానే ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఒకపక్క, వినూత్న పథకాలతో వైసీపీ ప్రభుత్వాధినేత, సీఎం జగన్ దూసుకుపోతున్నారు. నెలకో పథకం కింద ఆయన ప్రవేశ పెడుతున్నారు. వీటిని వెంటనే ప్రజలకు అందిస్తున్నారు. ఎన్నికలమేనిఫెస్టోలో పెట్టుకున్న పథకాలను తూచ తప్పకుండా అమలు చేస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని ఆయన అమలు చేస్తున్నారు. వీటికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే, వీటికి కూడా రాజకీయాలు ఆపాదించేశారు యనమల. జగన్ ప్రవేశ పెట్టిన, అమలు చేస్తున్న పథకాలు అన్నీ కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలోనివేనని యనమల చెప్పుకొచ్చారు. జగనన్న వసతి దీవెన మరో జగన్మాయే తప్ప కొత్త స్కీం కాదని యనమల అన్నారు. టీడీపీ ప్రవేశపెట్టిన పథకానికే పేరు మార్చారన్నారు. కొత్తగా ఇస్తున్నట్లు సీఎం జగన్ ఫోజులు కొడుతున్నారన్నారు.
ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేస్తున్నారని యనమల ఆరోపించారు. 75 శాతం హాజరు ఉండాలని..కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని కొర్రీలు పెడుతున్నారని, మాటల్లో తేనె.. చేతల్లో కత్తెర.. ఇది జగన్ నైజమని యనమల విమర్శించారు. టీడీపీ చేసిన దాన్ని జగన్ తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు.
కంటి వెలుగు కూడా టీడీపీ తెచ్చిన పథకమేనని అన్నారు. 9 నెలల్లో రూ.22 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయనడం మోసమని, 9 నెలల్లో రాష్ట్రానికి వచ్చిన కంపెనీల పేర్లు బయటపెట్టాలని యనమల డిమాండ్ చేశారు.
అయితే, యనమల చెబుతున్న దాని ప్రకారం ప్రజలకు అంతగా పథకాలను చేరువ చేస్తే.. చంద్రబాబును, ఆయన పార్టీని ప్రజలు గత ఏడాది ఎన్నికల్లో ఎందుకు చీదరించుకున్నారో.. ఎందుకు తరిమి కొట్టారో కూడా యనమల చెప్పి ఉంటే బాగుండేది. మంచిని మంచి అని ఒప్పుకోకపోయినా ఫర్వాలేదు. కానీ, ఇలా నీచ రాజకీయాలు చేయడం వల్ల యనమల ఏం సాధించాలని అనుకున్నారో అర్ధం కావడం లేదని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి నవ్విపోయినా.. నా పరిస్థితి ఇంతే అన్నట్టుగా యనమల రాజకీయం ఉందని చెబుతున్నారు.