కేవలం ఆస్తి కోసం ఈ మద్య ఐనవారిని సైతం దారుణంగా చంపేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. పైకి మంచిగా నటిస్తూ అదును చూసి వారి ప్రాణాలు హిరించడానికి ఎన్నో దారుణమైన కుట్రలు పన్నుతున్నారు. వివాహేతర సంబంధాలతో సొంత బిడ్డలను కూడా చంపేస్తున్నారు కొంత మంది తల్లులు. పద్నాలుగేళ్ల వ్యవధిలో ఆరు హత్యలకు పాల్పడిన సైకో సీరియల్ కిల్లర్ వ్యవహారం తెలిసిందే. ఆస్తి కోసం సైనేడ్ ను మటన్ సూప్ లో కలిపేసి ఒకరి తర్వాత ఒకరు చొప్పున ఆరుగురిని చంపేసిన జాలీ వ్యవహారంలో కేరళ రాష్ట్ర పోలీస్ బాస్ లోక్ నాథ్ బెహ్రా స్వయంగా రంగంలోకి దిగి అరెస్ట్ చేశారు. కాగా ఇలా ఒక కేసు ఇన్వెస్టిగేషన్ కోసం సాక్షాత్తూ రాష్ట్ర డీజీపీనే రంగంలోకి దిగడం..చాలా అరుదనే చెప్పాలి.
తాజాగా కోజికోడ్ జైలులో ఉన్న ఆమె గురువారం ఉదయం చేతిని కోసుకుంది. దీంతో జైలు అధికారులు చికిత్స నిమిత్తం జూలీని కోజికోడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో తరలించారు. అయితే ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జాలీ షాజు (47) అనే మహిళ 2002 నుంచి 2014 మధ్య తన మొదటి భర్తను, అతడి తల్లిదండ్రులను, తన రెండో భర్త మాజీ భార్యను, మరో ఇద్దరిని విషం పెట్టి చంపినట్లు అంగీకరించిందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆమె 2014లో ఒక చిన్నారిని కూడా చంపినట్లు చెప్తున్నారు.
కట్టుకున్న భర్త రాయ్ థామస్ను కూడా ఆమె దారుణంగా హతమార్చి, ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు కట్టుకథ అల్లింది. తన సోదరుడిది సహజమరణం కాదని.. రాయ్ థామస్ సోదరుడు మోజోకు అనుమానం వచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జూలీ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. తీగ లాగితే ఢొంక అంతా కదిలింది.. ఆశ్చర్యం గొలిపే ఆమె హత్యల పరంపర ఒక్కొక్కటీ వెలుగులోకి వచ్చాయి. ఈ మరణాలన్నింటికీ ప్రధాన సాక్షిగా భావించిన పోలీసులు విచారిస్తే.. జూలీ అరాచకాలు బయటపడ్డాయి. దీంతో జూలీతో పాటు ఆమె రెండో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.