విశాఖలో వైసీపీ కార్యకర్తలు ఎయిర్ పోర్టు వద్ద నానా హంగామా చేశారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును అడ్డుకునేందుకు అడుగడుగునా వైసీపీ శ్రేణులు యత్నించారు. అయితే అటు టీడీపీ శ్రేణులు కూడా వైసీపీ కార్యకర్తలను అడ్డు కునేందుకు నానా రచ్చ రచ్చ చేశాయి. చివరకు రెండు పార్టీల కార్యకర్తలు చెప్పులు, టమాటాలతో దాడులు చేసుకున్నారు. టీడీపీ కార్యకర్తలు కూడా రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించడంతో వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్పై చెప్పులు విసిరారు. కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. అవి పోలీసులపై పడ్డాయి.
గత నాలుగు గంటలుగా విశాఖ ఎయిర్ పోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నా మాత్రం అవి అదుపులోకి రావడం లేదు. విశాఖ ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో చంద్రబాబు విమానాశ్రయంలోనే ఉన్నారు. ఆయన కాన్వాయ్ వద్ద వైసీపీ కార్యకర్తలు భారీగా మోహరించారు. దీంతో కాన్వాయ్ బయటికి కదల్లేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటన ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఈ క్రమంలోనే విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు కారుపై కొందరు టమాటాలు, కోడిగుడ్లు విసిరారు. దీంతో వెలగపూడి కారు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. ఇక విశాఖలో పోలీసుల వైఫల్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఎయిర్పోర్టు దగ్గర పోలీసులు చేతులు ఎత్తేశారు. విమానాశ్రయంలోపలికి వైసీపీ కార్యకర్తల్ని అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని వైసీపీ పిలుపునిచ్చిన తర్వాత కూడా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకోలేదు.
ఏదేమైనా విశాఖలో బాబు పర్యటనను వైసీపీ అనవసరంగా అడ్డుకుని వైసీపీయే ఆయన్ను హీరోను చేసినట్లయ్యింది. ఇక వెలగపూడి కారు మీదే కాకుండా వైసీపీ శ్రేణులు చంద్రబాబు కాన్వాయ్పై సైతం శ్రేణులు కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. ఈ ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.