ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విశాఖ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాను ఏపీలో జగన్ అమలు చేస్తోన్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై 45 రోజుల పాటు ప్రజా చైతన్య యాత్రలు చేస్తానని బాబు ఇప్పటికే ప్రకటించారు. పార్టీ నాయకులు, నేతలు అందరూ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లాలని... తాను రోజుకు ఒక నియోజకవర్గానికి వస్తానని చెప్పారు. ఇక ఈ రోజు చంద్రబాబు విశాఖ పర్యటనకు వెళ్లి ఎయిర్ పోర్టులో దిగగానే అక్కడ టీడీపీ శ్రేణులు వర్సెస్ వైసీపీ శ్రేణుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో చంద్రబాబు మూడు నాలుగు గంటల పాటు బయటకు రాకుండా ఎయిర్ పోర్టులోనే ఉండిపోయారు.
ఇక పోలీసులు సైతం బాబు అక్కడ ఉంటే పరిస్థితి మరింత తీవ్రతరం అవుతుందని భావించి ఆయన్ను ఎయిర్ పోర్టు లోపల ఉన్న వీఐపీ లాంజ్లోకి తీసుకువెళ్లారు. ఇక చంద్రబాబును అరెస్టు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా ఎక్కడిక్కడ ఆందోళనలు చేశాయి. చంద్రబాబు ముందస్తు అరెస్ట్పై హైకోర్టులో టీడీపీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇచ్చి.. మళ్లీ రద్దు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇక చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బాబు భార్య భువనేశ్వరి వెంటనే విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన భార్య భువనేశ్వరి కలిశారు. ఉదయం నుంచి చంద్రబాబు విశాఖ ఎయిర్ పోర్టులోనే ఉండటంతో ఆందోళన చెందిన భువనేశ్వరి హుటాహుటిన విశాఖకు వచ్చినట్లు సమాచారం.
పోలీసులు బాబును అరెస్టు చేసి ఎయిర్ పోర్టులో లాంజ్ కు తరలించడంతో అక్కడ ఉన్న భర్తను భువనేశ్వరి పలకరించి.. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. దాదాపు ఏడు గంటల నుంచి చంద్రబాబు ఆహారం లేకుండా ఉండటంతో భువనేశ్వరి ఆందోళన చెందారని టీడీపీ నేతలు చెబుతున్నారు.