ప్రకాశం జిల్లా సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో కలకలం రేగుతోంది. రోజుకో ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతానికి  గుర్తు తెలియని వస్తువులు సముద్రంలో  కొట్టుకొస్తున్నాయి. అనుమానిత వస్తువులను చూసి మత్స్యకార గ్రామాల్లో ప్రజలు భయాందోళనకు  గురవుతున్నారు. గత మూడు నెలలుగా ప్రకాశం జిల్లా  సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో పరిస్థితి ఇలానే ఉంది.

 

ప్రకాశం జిల్లాలో మొత్తం 104 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. నిత్యం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతానికి గుర్తు తెలియని వస్తువులు కొట్టుకొస్తున్నాయి.  వీటిని చూసిన మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలోని తీర ప్రాంతంలో వేలాది మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. ప్రశాంతంగా ఉండే మత్స్యకార పల్లెల్లో గత మూడు నెలల నుంచి కలవరం మొదలైంది. కొట్టుకొస్తున్న వస్తువులను చూసి మత్స్యకారులతో పాటూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. 

 

మూడు నెలల క్రితం ఉలవపాడు మండలం పెద్దపట్టపుపాలెం గ్రామానికి సముద్రంలోంచి ఓ ఖాళీ కంటైనర్ కొట్టుకొచ్చింది. ఈ కంటైనర్‌ను చూసి స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సముద్రంలో కంటైనర్ కొట్టుకురావడం చర్చనీయాంశంగా మారింది. ఆ తరువాత కొత్తపల్లెపాలెం తీరానికి గుర్తు తెలియని మరో వస్తువు కొట్టుకొచ్చింది. సింగరాయకొండ మండలం పాకల మత్స్యకారుల వలకు బాంబును పోలిన గుండ్రటి వస్తువు చిక్కుకుంది. బాంబుగా భావించిన మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు. బాంబ్ డిస్పోజల్ స్వ్కాడ్‌తో రంగంలోకి  దిగిన పోలీసులు గుండ్రటి వస్తువుని భూమిలో పెట్టి  పేల్చేశారు. అయినా ఆ వస్తువు ఏంటనేది మాత్రం తెలుసుకోలేకపోయారు. 

 

ఇక...తాజాగా నాటుపడవలో వెదురు బొంగులతో  తయారు చేసిన మందిరం చీరాల మండలం విజయలక్ష్మీపురం సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది. మందిరంలో గౌతమ బుద్దుడి ఆకారంలో రాతితో చేసిన ఒక విగ్రహం ఉంది. తీర ప్రాంతానికి కొట్టుకొచ్చిన  మందిరాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు విజయలక్ష్మీపురం తరలి వచ్చారు. మత్స్యకారులు మెరైన్ పోలీసులకు  సమాచారం అందించారు. రెవెన్యూ అధికారులతో పాటూ  మెరైన్ పోలీసులు మందిరం ఎక్కడి నుండి కొట్టుకొచ్చిందో ఆరా తీసే పనిలో పడ్డారు. మందిరంలో  కొన్ని పాత్రలతో పాటూ శ్రీలంకలో తయారు చేసిన అగ్గిపెట్టెను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పది అడుగుల ఎత్తున్న మందిరం శ్రీలంకకి చెందినదిగా భావిస్తున్నారు. ఏదో ఒక ప్రాంతంలో గుర్తు తెలియని వస్తువులు సముద్ర తీర ప్రాంతానికి కొట్టుకురావడం జిల్లాలో కలకలం రేపుతోంది.

 

గత మూడు నెలలుగా జిల్లాలోని సముద్ర తీర ప్రాంత  గ్రామాల్లో అలజడి రేగుతోంది. ఏదో ఒక గుర్తు తెలియని వస్తువులు సముద్రం నుంచి ఇలా కొట్టుకువస్తున్నానే ఉన్నాయి. ఐతే...వాటి వివరాలు సేకరించడంలో అధికారులు విఫలం అయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: