వైసీపీ కీలకనేత నగరి ఎమ్మెల్యే రోజా ఎప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో  ఎంతో యాక్టివ్ గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి సర్కారుపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు ఎప్పుడూ కౌంటర్ ఇస్తూ ఉంటారు. అయితే తాజాగా విశాఖలో విమానాశ్రయం వద్ద చంద్రబాబును అడ్డుకున్న ఘటనపై స్పందించిన రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో  అర్థం అవుతుంది అంటూ వ్యాఖ్యానించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు... టిడిపి ప్రభుత్వ హయాంలో ఎంత అవినీతి అరాచకం జరిగిందో ఈ ఘటన ఉదాహరణగా ఉంటుంది అంటూ నగరి ఎమ్మెల్యే రోజా తెలిపారు. చంద్రబాబు సామాజిక వర్గం తో వైసీపీ ఎమ్మెల్యేల పై దాడులు చేస్తూ... భయబ్రాంతులకు గురి చేస్తున్న వారు రౌడీలు కాదా అంటూ ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా.

 

 

 టీడీపీ అధినేత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు నీతులు  మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది అంటూ నగరి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర... వైసీపీ నేతలు చంద్రబాబును అడ్డుకునేందుకు ప్రయత్నించారు అంటూ జగన్ మోహన్ రెడ్డి సర్కారుపై చంద్రబాబునాయుడు అనవసరంగా నిందలు వేస్తున్నారని... విశాఖ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇచ్చేందుకు సిద్ధం అంటూ తెలిపారు ఎమ్మెల్యే రోజా. ఎక్కడైనా కడప రౌడీలు కనిపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికైనా సిద్ధం అంటూ తెలిపారు. 

 

 

 ముఖ్యమంత్రి కొడుకు అయ్యి  ఉండి కూడా ఎమ్మెల్యేగా గెలవలేక పోయినా లోకేష్ కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత అసలు లేదు అంటూ విరుచుకుపడ్డారు నగరి ఎమ్మెల్యే రోజా. ఇక సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఓ రైతు పాస్బుక్ కోసం లక్ష రూపాయలు ఇచ్చాను అని చెప్పడం నిజంగా సిగ్గుచేటు అని విమర్శించారు ఎమ్మెల్యే రోజా. ఒక ప్రాంతానికి అన్యాయం చేసి అభివృద్ధిని అడ్డుకుని వారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు... మళ్లీ అదే ప్రాంతానికి వెళితే ప్రజలు ఎలా స్వాగతిస్తారు అనే విషయం కూడా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది ఎంతో చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడుకు  తెలియదా అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే రోజ.

మరింత సమాచారం తెలుసుకోండి: