దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న ఢిల్లీ అల్లర్లలో కొత్త కోణాలు బయటికి వస్తున్నాయి. అన్ని పార్టీలు, ఆయా ప్రాంతాల ప్రజలలో ఒకింత ఆందోళన రేకెత్తిస్తున్న రాజధాని గొడవలపై కలకలం రేగుతోంది. ఢిల్లీలో అల్లర్ల నేపథ్యంలో కీలకమైన ఢిల్లీ -ఘజియాబాద్ సరిహద్దు ప్రాంతాలు పోలీస్ పహారాలోకి వెళ్లాయి. అల్లరి మూకలు దాడులు చేయకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఘజియాబాద్ నగరాన్ని 18 సెక్టార్లు, 56 జోన్లుగా విభజించి ఆయా ప్రాంతాల్లో గస్తీ కోసం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను రంగంలోకి దించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.
కాగా, ఢిల్లీలో అల్లర్లు చెలరేగుతున్న తరుణంలో మహారాష్ట్రలో నవ నిర్మాణ సేన పోస్టర్లు సంచలనంగా మారాయి. ఔరంగాబాద్లో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పేరుతో పోస్టర్లు వెలిశాయి. ఎంఎన్ఎస్ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ఫోటోతో ఉన్న పోస్టర్లలో.. పాకిస్థాన్, బంగ్లాదేశ్ చొరబాటుదారులను గుర్తించాలని పిలుపు ఇచ్చారు. వారి సమాచారం అందించిన వారికి ఐదు వేల రూపాయల నగదు బహుమతిని ఇస్తామంటూ ఆఫర్ చేశారు. ఉద్దవ్ పేరుతో వెలిసిన ఈ పోస్టర్ల వెనుక మతలబు ఏంటని చర్చ జరుగుతోంది.
మరోవైపు ఢిల్లీలో ఆప్ కార్పొరేటర్ తాహిర్ నేతృత్వంలోనే దాడులు జరిగినట్లు పోలీసులకు ఆధారాలు దొరికాయి. ఐబీ అధికారి అంకిత్ శర్మ డెడ్ బాడీ దొరికింది తాహీర్ ఇంటి దగ్గరే కావడంతో… అతనిపై అనుమానాలు పెరుగుతున్నాయి. దీంతో పోలీసులు తాహిర్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం తాహిర్ పరారీలో ఉన్నారు. అయితే ఆప్ సీనియర్ నేతలు మాత్రం అల్లర్లు ప్రోత్సహించిన వారు ఎవరైనా.. చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు. ఇదిలాఉండగా, ఢిల్లీ సీపీగా ఎస్ఎన్ శ్రీవాస్తవను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీపీ అమూల్య పట్నాయక్ పదవీ కాలం నేటితో ముగియనుండటంతో..శ్రీవాస్తవను సీపీగా నియమించింది. కాగా మార్చి ఒకటిన శ్రీవాస్తవ బాధ్యతలు చేపట్టనున్నారు.