ఢిల్లీలో రాజ్య హింస నేపథ్యంలో అనేక అమానుష చర్యలు ఆలస్యంగా వెలుగు చూస్తున్నాయి. స్థానిక కరవాల్నగర్లోని ఓ నిండు గర్భిణి షబానా పర్వీన్ (30) పై మూకుమ్మడి దాడి జరిగింది. ఆమె ఇంట్లోకి చొరబడిన దుండగలు, కనీసం గర్భిణి అన్న కనికరం లేకుండా ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారు. పర్వీన్ భర్త, అత్తను కూడా గాయపర్చారు. గర్భిణి పర్వీన్ పొత్తి కడుపుపై తన్నారు. వద్దని ఎంతగా బతిమి లాడినా వినిపించుకోకుండా దాడి చేశారు.
ఈ క్రమంలో పర్వీన్ శరీరానికి బలమైన గాయాలు అయ్యాయి. అంతటితో ఆగని దుండగలు వారిని ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారు. వారి ఇంటికి నిప్పు అంటించారు. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న పర్వీన్ను కటుంబ సభ్యులు ఏదో విధంగా సమీప ఆసు పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆమెను ముస్తఫాబాద్లోని అల్ హింద్ ఆసుపత్రికి సిఫార్సు చేశారు. ఈ క్రమంలో పర్వీన్ 36 గంటల పాటు ప్రసవ వేదనను అనుభవించారు.
తీవ్రమైన పరిస్థితుల నడుమ పర్వీన్ పండంటి మగబిడ్డకు జన్మను ఇచ్చారు. తమకు పుట్టినది మిరాకిల్ బేబీ అని, లక్కీ బాబీ అని పర్వీన్ దంపతులు ముచ్చట పడుతున్నారు.. కానీ, తమ ఇల్లు కాలి బూడిద య్యిందని, సర్వం కోల్పోయామని, బిడ్డను తీసుకొని ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని పర్వీన్ కుటుంబం ఈ సందర్భంగా తీవ్రమైన దుఃఖానికి లోనైంది. ఇలా అనేకం... ఢిల్లీలో చెలరేగిన అల్లర్లు ఆయా కుటుంబాల్లో మిగిల్చిన విషాదం గురించి అనేక కథనాలు లేటుగా.. ఒక్కొక్కటి.. వెలుగుచూస్తున్నాయి.
అలాగే ఇంకొకటి.. అక్కడ.. పెళ్లి సందడి నుంచి ఇంకా ఆ కుటుంబం బయటకు రానేలేదు.. వధూవరులు ఇద్దరు కలిసి కనీసం ఒక్క క్షణమైనా ముచ్చటగా గడపలేదు. అప్పుడే నూతన వరుడు హత్యకు గురవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దేశంలో అవనీయమైన రాజకీయ పరిస్థితుల నడుమ తమ కుటుంబం నలిగిపోయి చితిలో కాలిపోతోందంటూ... సదరు వరుని తండ్రి కన్నీటి పర్యంతం అయిన సంఘటన మనకు కన్నీరు పెట్టించక మానదు.