ప్రేమ ఒక్కొక్కసారి మంచిని చెడులా చూపిస్తుంది అనడానికి ఈ సంఘటన ఒక్క ఉదాహరణ. పుట్టినరోజు నాడు ప్రియురాలి ఫోన్ కోసం ఎదురుచూశాడు. ఆమె ఫోన్ చేయకపోవడంతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది. ఈ విషాద సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

 

చిక్కబళ్లాపూర్ జిల్లా బందహళ్లికి చెందిన ఎం.శివకుమార్ అనే యువకుడు సొంత కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో బెంగళూరులోని యెళహంక ప్రాంతంలో నివాసం ఉంటూ నగరంలో కారు నడుపుతూ ఉపాధి పొందేవాడు. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది.

 

ప్రేమించిన యువతిని శివకుమార్ పెళ్లి చేసుకోవాలని భావించాడు. అందుకు ఇరు కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. అయితే శివకుమార్ తండ్రి గతంలోనే చనిపోయాడు. అతని తల్లి తమ్ముడితో కలసి స్వగ్రామం బందహళ్లిలోనే ఉంటోంది. గత కొద్దికాలంగా తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది.

 

అమ్మ అనారోగ్యంతో బాధపడుతోందని.. ఇక్కడే ఉండి ఆమెను చూసుకుంటే మంచిదని భావించిన శివకుమార్ గతేడాది స్వగ్రామానికి వచ్చేశాడు. ఆ విషయం తను ప్రేమించిన యువతికి కూడా చెప్పాడు. అయితే అందుకు ఆమె ఆసక్తి చూపలేదు. సిటీని వదిలి వెళ్లేందుకు ఇష్టపడలేదు.

 

తల్లి ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని శివకుమార్ స్వగ్రామానికి వచ్చేసి సమీపంలోని చిక్కబళ్లాపురలో కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తన పుట్టిన రోజు రావడంతో తను ప్రేమించిన యువతి ఫోన్ చేసి విషెస్ చెబుతుందని భావించాడు. ఎంతకీ ఆమె ఫోన్ చేయకపోవడంతో దారుణానికి ఒడిగట్టాడు. రాత్రి భోజనం చేసి గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 

సూసైడ్ లేఖ రాసిపెట్టి మరీ ప్రాణాలొదిలాడు. తాను చేసిన మంచి పనిని ఈ ప్రపంచంలో ఎవరూ గుర్తించడంలేదని.. చివరికి తను ప్రేమించిన అమ్మాయి కూడా తనను అర్థం చేసుకోలేదని లేఖ రాసిపెట్టి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: