ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ వారం బిజీ బిజీ గా గడిపారు. ముఖ్యంగా పరిపాలనలో వరుసగా సమీక్షా సమావేశాలతో జగన్ బిజీ బిజీ గా గడిపారు. సోమవారం జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. విజయనగర౦ నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టారు జగన్. సచివాలయంలో మంగళవారం ప్రపంచ బ్యాంక్ దక్షిణాసియా , మానవ వనరుల అభివృద్ధి విభాగం రీజనల్ డైరెక్టర్ షెర్బర్న్ బెంజ్ మరియు అధికారులతో భేటీ అయ్యారు జగన్. రాష్ట్రంలో వరల్డ్ బ్యాంక్ నిధులతో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టులపై వారితో చర్చించడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను వివరించారు.
అదే విధంగా స్పందన కార్యక్రమం పై జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు జగన్. ఇజ్రాయిల్ దేశానికి చెందిన ఐడీఈ టెక్నాలజీస్ సంస్థ ప్రతినిధులతో సమావేశం అయ్యారు జగన్. బుధవారం విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అదే రోజు మరో కీలక పరిణామం జరిగింది. తాడేపల్లి లోని సిఎం క్యాంపు కార్యాలయంలో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులతో ఆయన సమావేశం అయ్యారు. ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, శ్యాం ప్రసాద్ రెడ్డి తో ఆయన సమావేశం అయ్యారు.
ఇక అది పక్కన పెడితే ఈ వారం ఆయన పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించడం హైలెట్ గా నిలిచింది. పోలవరం ప్రాజెక్ట్ వద్దకు వెళ్ళిన ఆయన ఏరియల్ వ్యూ నిర్వహించారు. ఆ తర్వాత ప్రాజెక్ట్ స్థితిగతులపై అధికారులతో మాట్లాడారు జగన్. 16 నెలల్లో ప్రాజెక్ట్ ని పూర్తి చెయ్యాలి అంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. శనివారం మధ్యాహ్నం ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబాని తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనపై ఆయనతో చర్చలు జరిపారు సిఎం. ముఖేష్ అంబాని తో దాదాపు గా రెండు గంటల పాటు జగన్ చర్చలు జరపడం విశేషం.