ఇటీవల భారత్లో కుటుంబ సమేతంగా పర్యటించిన ట్రంప్... ఆ విశేషాలను నెమరవేసుకుంటూ మురిసిపోతున్నారు. మన ఆతిథ్యానికి ఫిదా అయిన పోయిన శ్వేతసౌదాధిపతి... భారత్ను పొగడకుండా ఉండలేకపోతున్నానని అంటున్నారు. వేలాది మంది అమెరికన్లతో తన భారత్ పర్యటన అనుభవాల్ని పంచుకున్నారు. ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు ట్రంప్.
ఆ పర్యటన ఓ మధురానుభూతి. ఆ ఆతిథ్యం అమోఘం. ఎప్పటికీ మరపురానిది. ఈ మాటలనింది సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన పొగడ్తలతో ముంచెత్తుతోంది మన భారత్నే. ఇటీవల భారత్లో పర్యటించిన శ్వేతసౌదాధిపతి... మన స్వాగత-సత్కారాలకు ఫిదా అయిపోయారు. సౌత్ కరోలినాలో జరిగిన ఓ సభలో పాల్గొన్న ట్రంప్... వేలాది మంది అమెరికన్ల ముందు భారత్పై పొగడ్తలు కురిపించారు.
తన భారత పర్యటన ఫలవంతమైందన్నారు ట్రంప్. మనకు అక్కడ గొప్ప ఆతిథ్యం లభించిందని వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్ మోతెరా స్టేడియంలో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. జనం భారీగా హాజరవడంపై హర్షం వ్యక్తం చేశారు. భారతీయులకు అమెరికా అంటే ఎంతో అభిమానం ఉందన్నారు ట్రంప్.
భారతీయులకు అద్భుతమైన నాయకుడు ఉన్నాడంటూ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు ట్రంప్. భారత పర్యటనలో మోడీతో కలిసి తిరిగానని... అయన చాలా అద్భుతమైన వ్యక్తిని... ప్రజలు ఆయన్ని బాగా అభిమానిస్తారన్నారు ట్రంప్.
గత నెల 24, 25 తేదీల్లో భారత్లో పర్యటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. 36 గంటల పర్యటన కోసం భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు కుష్నర్లను వెంటబెట్టుకొచ్చారు. నమస్తే ట్రంప్ కార్యక్రమంలో లక్షా 10 వేల మందిని ఉద్దేశించి ట్రంప్, మోడీ మాట్లాడారు. తాజ్మహల్ అందాల్ని ఆస్వాదించడంతో పాటు వీరంతా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తన భారత్ పర్యటన అనుభవాల్ని... అపూర్వ ఆతిథ్యంతో మనపై ఏర్పడిన అభిమానాన్ని అమెరికన్లతో పంచుకున్నారు ట్రంప్.