రాష్ట్ర ప్రయోజనాలు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో పరిపాలన వికేంద్రీకరణ చేసి మూడు నగరాలకు విస్తరిస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త రాజధాని నగరాన్ని నిర్మించకుండా, మూడు నగరాలు కార్యనిర్వాహక, న్యాయ, శాసన కేంద్రాలుగా ఉండటానికి మార్గం సుగమం చేయడానికి అన్ని ప్రాంతాల వికేంద్రీకరణ మరియు సమాన అభివృద్ధి బిల్లును గత నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. అయితే, ఈ విషయంలో విభిన్న అబిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలో మాత్రం ఒకింత కలవరం మొదలైందని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్పై బీజేపీ అధి నాయకత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది . దీంతో రాష్ట్ర బీజేపీని పరుగులు పెట్టే అధ్యక్షుని కోసం కసరత్తు చేస్తోంది. అధ్యక్షుడి కోసం ఇప్పటికే అభిప్రాయ సేకరణ జోరుగా సాగుతోంది. ఏపీ బీజేపీ అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు మరికొంత మంది నేతలు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారని ప్రచారం జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో అధ్యక్ష ఎంపిక ప్రక్రియను పూర్తిచేసేందుకు అధిష్టానం కరసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది సీనియర్ నేతల ఢిల్లీ పయనం ఆసక్తి కలిగిస్తోంది. అయితే, ఇదే సమయంలో మరోసారి తనను అధ్యక్షుడిగా కొనసాగించాలని కన్నా బలంగా కోరుకుంటున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇందుకోసం ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారని అంటున్నారు.
అయితే, ప్రధాని మోడీ, ఆయన సన్నిహితుడైన జాతీయ మాజీ అధ్యక్షుడు అమిత్ షా కన్నా పని తీరుపై సంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కీలకమైన అమరావతి విషయంలో పార్టీ వైఖరిని కన్నా సరిగా వ్యక్తీకరించలేకపోతున్నారని కామెంట్లు తెరమీదకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కన్నా అమరావతిపై ఆందోళనలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.