ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. జమ్మూకాశ్మీర్ పర్యాటక శాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్. ఎస్.జాంవాల్, పర్యాటక కూటముల ప్రతినిధులు మంజూర్ ఏ. పాక్టూన్, తదితరులు విజయవాడ బందరు రోడ్డులోని సమావేశ మందిరంలో జమ్మూకాశ్మీర్ ప్రభుత్వ పర్యాటక శాఖ, జెకె పర్యాటక కూటమిలతో కలిసి విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ సంధర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టూరిజాన్ని ప్రమోట్ చేయడం ద్వారా రాష్ట్రానికి అదనపు పెట్టుబడులు వచ్చేలా ప్రోత్సాహకాలు అందిస్తున్నారని తెలిపారు. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా టెంపుల్ టూరిజం పేరిట రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలన్నింటిలో మంచి సౌకర్యాలు కల్పించి, చక్కటి రవాణా, వసతి ఏర్పాట్లు కల్పించాలని టూరిజం శాఖ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారన్నారు.
పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ టూరిజాన్ని మరింత ప్రచారాన్ని కలుగ చేస్తున్నారని విష్ణు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అవినీతికి తావు లేకుండా, పారదర్శకంగా సహకారం అందించడం, పెట్టుబడులకు సింగిల్ విండో(ఏక గవాక్ష) విధానంలో అనుమతులిస్తోందని తెలిపారు. అందువల్ల దేశీయ, అంతర్జాతీయ పర్యాటక కంపెనీలు సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తున్నాయన్నారు. ఇటీవల కాలంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాల టూరిజం సంస్థలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న అనేక టూరిజం కంపెనీలు మన రాష్ట్రంలో ప్రదర్సనలు నిర్వహిస్తున్నాయన్నారు. వీటి వల్ల మన రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు పెద్ద ఎత్తున దేశీ, విదేశీ పర్యాటకులు ఆకర్షితులవుతారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ కలిసి జమ్మూకశ్మీర్లో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి ఆధ్యాత్మికతతో పాటు టెంపుల్ టూరిజాన్ని విస్తరించే కార్యక్రమాలు చేపడుతోందని శాసనసభ్యులు విష్ణు తెలిపారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధి నేపథ్యంలో జమ్మూకశ్మీర్ టూరిజం శాఖ విజయవాడలో ట్రావెల్ ట్రేడ్ నిర్వహిస్తుండటం ఆహ్వానించదగిన పరిణామన్నారు. ప్రస్తుతం అక్కడ కూడా సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో మన రాష్ట్ర ప్రజలను అక్కడి పర్యాటక ప్రాంతాలను దర్శించి చక్కటి అనుభూతులు సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ట్రావెల్ ట్రేడ్ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. మన రాష్ట్రం నుంచి జమ్మూకశ్మీర్ వెళ్లాలనుకునే పర్యాటకులంతా అక్కడ టీటీడీ ఆలయాన్ని కూడా సందర్శించి దైవ దర్శనం పొంద వచ్చున్నారు. ఈ ట్రావెల్ ట్రేడ్ ద్వారా మన రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాలు, అనుకూలతలు దేశవ్యాప్తంగా తెలుస్తాయి. తద్వారా దేశ, విదేశీ పర్యాటకులు మన రాష్ట్రంలోని దర్శనీయ ప్రదేశాలను సందర్శించి, మన ఆతిధ్యం స్వీకరిస్తారని తెలిపారు.
జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రతినిధులు వివరాలు తెలుపుతూ, ఇక్కడ పహల్గాంలోని పవిత్ర లింగం శ్రీ అమర్నాథ్ జీ పుణ్యక్షేత్రం , జమ్మూ కాశ్మీర్లో 2/3/4/5 స్టార్ హోటళ్ళు మరియు అప్గ్రేడెడ్ లగ్జరీ రిసార్ట్లు పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రఖ్యాత గోల్ఫ్ కోర్సు, లిడర్ నదిపై రివర్ రాఫ్టింగ్, కాశ్మీర్ నదుల యొక్క సహజమైన ఫిషింగ్ బీట్లపై ఆంగ్లింగ్, హర్వాన్లో పారాగ్లైడింగ్, పహల్గామ్ & సోనమార్గ్ ప్రాంతంలో ట్రెక్కింగ్, క్రాస్ డిస్ట్రిక్ట్ ట్రెక్స్కు సాహస క్రీడలకు తగినంత అవకాశం ఉందన్నారు. వైల్డ్ లైఫ్, సోన్మస్ పాస్ సోనమార్గ్ మరియు లడఖ్ ప్రాంతానికి , శ్రీనగర్ లో పర్యాటకులు జీలం క్రూయిజ్ల, లాల్డెడ్ కల్చరల్ సెంటర్, దాల్ సరస్సుపై లేజర్ షోలు, ఫౌంటైన్లు, జల కార్యకలాపాలు సౌండ్ & లైట్ షోస్, వరల్డ్ క్లాస్ ఎగ్జిబిషన్ సెంటర్, ఇంటర్నేషనల్ కుంకుమ ట్రేడింగ్, వంటి ఎన్నో ప్రకృతి సహజ అందాలు అరబోయడంతో జమ్మూకాశ్మీర్ ప్రత్యేకత ఉన్నదన్నారు. పర్యాటకులకు పూర్తి రక్షణ కలిగిన ప్రదేశం గా , అక్కడివారు ఎంతో సహకారాన్ని అందించడం జరుగుతున్న దని తెలిపారు. సోలో పర్యాటకులకు పూర్తిగా రక్షణ ఇక్కడ లభిస్తుందని తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, జె అండ్ కె గవర్నమెంట్, మిస్టర్ ఎన్ ఎస్ జామ్వాల్ తో పాటు, జమ్మూ & కెలో పర్యాటక రంగం యొక్క ప్రమోషన్ మరియు వృద్ధి మార్గంలో ఉన్న లోపాలు మరియు అవరోధాలపై పర్యాటకులకు తెలియచెయ్యడం జరుగుతున్నట్లు తెలిపారు.