ఏపీలో త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికలు అధికార వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డికి పెద్ద సవాల్గా మారనున్నాయి. ఎన్నికలు జరిగే నాలుగు రాజ్యసభ స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. మరోవైపు పార్టీ నేతల్లో రాజ్యసభ సీట్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. మరోవైపు రిలయన్స్ అధినేత ఒక సీటు తన స్నేహితుడికి రికమెండ్ చేశారన్న ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు కారణం అవుతోంది.
ఇక మరో సీటుకు టీడీపీ నుంచి వైసీపీ లో చేరిన బీద మస్తాన్ రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ లెక్కలు ఇలా ఉంటే రాజ్యసభ సీట్ల కోసం జగన్పై ఏకంగా ఇద్దరు లేడీ లీడర్లు ప్రెజర్ చేస్తున్నారట. అయితే వీరి గోడు జగన్ ఎంత మాత్రం పట్టించుకునే పరిస్థితి కూడా లేదంటున్నారు. ఆ ఇద్దరు మహిళా నేతలు ఎవరో కాదు. మాజీ ఎంపీలు కిల్లి కృపారాణి, బుట్టా రేణుక. వీరిద్దరిలో కృపారాణి గతంలో ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఇక బుట్టా రేణుక వైసీపీ ఎంపీగా గెలిచి.. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లి గత ఎన్నికలకు ముందు అక్కడ సీటు ఇవ్వకపోవడంతో తిరిగి వైసీపీలోకి వచ్చేశారు.
ఇక ఈ ఎన్నికల్లో ఈ ఇద్దరికి జగన్ సీట్లు ఇవ్వలేదు. తాము చేసిన త్యాగాల నేపథ్యంలోనే తమకు రాజ్యసభ సీట్లు ఇవ్వాలని జగన్కు విన్నవించుకుంటున్నా ఇప్పుడున్న పోటీ పరిస్థితుల్లో అస్సలు జగన్ వీరి మాటలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరట. కృపారాణి బీసీ కోటాలో తనకు పదవి ఇవ్వాలని ఎంత మొత్తుకుంటున్నా జగన్ మాత్రం తగిన సమయంలో సముచిత స్థానం కల్పిస్తానని చెప్పేసినట్టు టాక్. ఇక బుట్టా రేణుక మాటలు బుట్టలోకే పోయాయంటున్నారు.