నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషి పవన్ గుప్తా దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో అతడు కొద్ది గంటల వ్యవధిలోనే క్షమాభిక్ష పిటిషన్ను దాఖలు చేయగా అంతే వేగంగా రాష్ట్రపతి తిరస్కరించారు. వాస్తవానికి నలుగురు దోషులను మార్చి 3న ఉదయం ఆరుగంటలకు ఉరి తీయాల్సింది. ఉరి శిక్ష అమలును ఆలస్యం చేయడం కోసం నలుగురు దోషులు క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడం, రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరడం లాంటి మార్గాలను ఉపయోగించుకున్నారు.
మరోవైపు, దోషి అక్షయ్ డెత్ వారెంట్లపై స్టే కోరుతూ అక్షయ్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై కోర్టు మరోసారి విచారణ చేపట్టి తీర్పును రిజర్వ్లో ఉంచింది. ఉరిశిక్షపై తాను మరోసారి రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకున్నానని, అందువల్ల డెత్ వారెంట్పై స్టే ఇవ్వాలని కోరుతూ అక్షయ్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన పాటియాలా హౌస్ కోర్టు అక్షయ్ అభ్యర్థనను కొట్టివేసింది. రేపటి ఉరితీతపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది.
దీంతో నిర్భయ దోషుల ఉరి రెండుసార్లు వాయిదా పడింది. మూడోసారి కూడా ఉరి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ గుప్తా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసినందున.. ఉరి వేసే విషయమై పటియాలా హౌస్ కోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఈ నేపథ్యంలో నిర్భయ దోషుల తరఫున వాదనలు వినిపిస్తోన్న లాయర్ ను జడ్జి హెచ్చరించారు. మీరు నిప్పుతో చెలగాటం ఆడుతున్నావ్.. జాగ్రత్త అని ఏపీ సింగ్ ను ఉద్దేశించి జడ్జి వ్యాఖ్యానించారు. ఎవరైనా ఒక తప్పటడుగు వేస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయో మీకు తెలుసంటూ జడ్జి వ్యాఖ్యానించారు.
నిర్భయకు న్యాయం చేయడాన్ని ఆలస్యం చేసేలా దోషుల తరఫు లాయర్ వ్యవహరిస్తున్నారనే ఉద్దేశంలో జడ్జి ఇలా మాట్లాడారు. తొలిసారి ఉరి అమలు వాయిదా పడినప్పుడు ఉరిశిక్ష అమలు చేయనీయబోను అని ఏపీ సింగ్ తనతో ఛాలెంజ్ చేశారని నిర్భయ తల్లి వాపోయిన సంగతి తెలిసిందే.